మన దేశంలో బంగారానికి ఎప్పటినుంచో భారీ డిమాండ్ ఉంది. గోల్డ్ కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా, పెట్టుబడిగా కూడా చూసేవారి సంఖ్య నేడు గణనీయంగా పెరిగింది. ఈ మధ్యకాలంలో ఫిజికల్ గోల్డ్తో పాటు డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో డిజిటల్ గోల్డ్ రంగంపై.. కేంద్ర ప్రభుత్వం మరింత నియంత్రణ తీసుకురావాలని ఆలోచిస్తోంది.
ఫిజికల్ గోల్డ్ బ్యాకింగ్
ప్రభుత్వం పరిశీలిస్తున్న ముఖ్యమైన ప్రతిపాదనల్లో ఒకటి ప్రతి డిజిటల్ గోల్డ్ యూనిట్కు తగినంత ఫిజికల్ గోల్డ్ బ్యాకింగ్ ఉండేలా నిబంధనలు తీసుకురావడం. అంటే.. ఆన్లైన్లో ఎంత బంగారం కస్టమర్లకు విక్రయించబడుతుందో, దానికి సరిపడే నిజమైన బంగారం కూడా భద్రపరిచి ఉండేలా చూడడం. దీనివల్ల పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుంది.
ఆర్బీఐ, సెబీ పరిధిలోకి?
డిజిటల్ గోల్డ్ను.. సెక్యూరిటీ కాంట్రాక్ట్ (రెగ్యులేషన్) యాక్ట్, 1956 కింద సెక్యూరిటీగా గుర్తించాలనే ప్రతిపాదనపై సంబంధిత వర్గాల్లో ఏకాభిప్రాయం ఏర్పడినట్లు సమాచారం. 2025లోనే సెబీ డిజిటల్ గోల్డ్పై పెట్టుబడిదారులను హెచ్చరించింది. ఇవి సెబీ నియంత్రించే సెక్యూరిటీ లేదా కమోడిటీ డెరివేటివ్స్ కాదని, అందువల్ల గోల్డ్ ఈటీఎఫ్ వంటి సెబీ రేగులేటెడ్ ఉత్పత్తులకు లభించే రేగులటరీ ప్రొటెక్షన్ వీటికి ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది.
అందుకే డిజిటల్ గోల్డ్కు డిమాండ్
డిజిటల్ గోల్డ్కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం.. చిన్న మొత్తంతోనే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటం. పరిశ్రమ అంచనాల ప్రకారం, దేశంలోని డిజిటల్ గోల్డ్ రంగంలో సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, సగటు పెట్టుబడి మొత్తం దాదాపు రూ.100గా ఉందని చెబుతున్నారు. అయితే.. నియంత్రణ లేకపోవడం వల్ల కొంతమంది అనధికార ఆపరేటర్లు రంగంలోకి రావచ్చనే ఆందోళనలు ఉన్నాయి. పెట్టుబడిదారుల రక్షణతో పాటు మనీలాండరింగ్ వంటి అంశాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డిజిటల్ గోల్డ్ రంగం అభివృద్ధి చెందుతున్న సమయంలో.. దీనికి కొంత పర్యవేక్షణ అవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎంటీసీ-పీఏఎంపీ మేనేజింగ్ డైరెక్టర్ సమిత్ గుహా మాట్లాడుతూ.. డిజిటల్ గోల్డ్, సిల్వర్కు వినియోగదారుల్లో ఆదరణ పెరుగుతున్నందున నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. ఈ ఏడాది డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్లు కలిసి డిజిటల్ ప్రీషియస్ మెటల్స్ అష్యురెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే స్వీయ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేశాయి. ఇందులో ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్గోల్డ్తో పాటుగా ఫోన్పే, భారత్పే, మొబిక్విక్, లెండెన్ క్లబ్, క్రెడ్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బిగ్ షాక్.. హాల్మార్కింగ్ ఛార్జీ పెంపు!


