యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) స్పందించింది. యూపీఐ ద్వారా రూ.2,000కు మించి చేసే కొన్ని వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే నిర్ణయానికి ఆర్బీఐ మద్దతు తెలిపింది. ఈ చర్య యూపీఐ చెల్లింపుల వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలకడగా కొనసాగేందుకు, సాంకేతికత, మౌలిక వసతులు, సైబర్ భద్రత వంటి రంగాల్లో పెట్టుబడులకు తోడ్పడుతుందని ఆర్బీఐ పేర్కొంది.
ఆర్బీఐ ఎక్స్లో చేసిన పోస్టులో.. రూ.2,000కు మించిన పెద్ద విలువ కలిగిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ప్రవేశపెట్టడం కీలకమైన అడుగని తెలిపింది. దీని ద్వారా యూపీఐ మరింత విస్తరించడంతో పాటు కొత్త సేవలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని పేర్కొంది. ఎండీఆర్ ద్వారా వచ్చే మొత్తాన్ని చెల్లింపుల వ్యవస్థలోని వివిధ భాగస్వాముల మధ్య పంపిణీ చేయడం ద్వారా మౌలిక వసతులు, అంగీకార నెట్వర్క్లలో నిరంతర పెట్టుబడులకు మద్దతు లభిస్తుందని వివరించింది.
వినియోగదారులపై ఎలాంటి ఛార్జీ ఉండదు
కొత్త నిబంధనల వల్ల యూపీఐ వినియోగదారులపై నేరుగా ఎలాంటి ఛార్జీ ఉండదని ప్రభుత్వం, ఆర్బీఐ స్పష్టం చేశాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) చేసే యూపీఐ లావాదేవీలు ఎంత మొత్తమైనా ఉచితంగానే కొనసాగుతాయి. అలాగే వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) చేసే రూ.2,000 వరకు చెల్లింపులపైనా ఎలాంటి ఎండీఆర్ ఉండదు.
రూ.2,000కు మించిన అర్హత కలిగిన P2M లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300 ఉంటుంది. ఉదాహరణకు రూ.10,000 విలువైన వ్యాపార యూపీఐ లావాదేవీపై ఎండీఆర్ రూ.40 అవుతుంది.
కొత్త చార్జీలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ ప్రకారం, ఎండీఆర్ను యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములకు తగిన విధంగా పంపిణీ చేయడం వల్ల సాంకేతికత, మౌలిక వసతులు, చెల్లింపుల అంగీకార నెట్వర్క్లలో పెట్టుబడులు కొనసాగించేందుకు వీలవుతుంది. తద్వారా యూపీఐ వినియోగం మరింత విస్తరించి, వినియోగదారుల సంఖ్యతో పాటు లావాదేవీల పరిమాణం కూడా పెరిగే అవకాశం ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది.
2016లో ప్రారంభమైన యూపీఐ.. భారత్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక భాగంగా మారింది. 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.0.07 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీల విలువ 2026 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరింది.


