దేశీయ ఆటోమొబైల్ రంగం ఆగస్టులో రికార్డు స్థాయి విక్రయాలతో అదరగొట్టింది. వాహన తయారీ సంస్థల నుంచి డీలర్లకు సరఫరా అయ్యే ప్యాసింజర్ వాహనాల పంపిణీ (డిస్పాచ్)లు ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన ఏకంగా 36.5 శాతం పెరిగి 4,39,309 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది (2025) ఆగస్టులో ఇవి 3,21,901 యూనిట్లుగా నమోదైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది.
ద్విచక్ర వాహన అమ్మకాలు ఆగస్టులో 10.5 శాతం వృద్ధితో 20,34,698 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 18,41,954 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే త్రీ–వీలర్ల డిస్పాచ్లు సైతం 22.8 శాతం పుంజుకుని 93,764 యూనిట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది నమోదైన 76,324 యూనిట్లతో పోలిస్తే ఇది మెరుగైన వృద్దిగా ఉంది.
‘‘ఆగస్టు నెలలో ప్యాసింజర్ వాహనాలు, టూవీలర్, త్రీ–వీలర్ విక్రయాలు ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయి (ఆల్టైమ్ హై)ని నమోదు చేశాయి. గతేడాది (2025) బేస్ ఎఫెక్ట్ తక్కువగా ఉండటం కూడా ప్రస్తుత ఆగస్టు రికార్డు వృద్ధికి దున్నుగా నిలిచింది. దేశీయ మార్కెట్లో వాహన డిమాండ్ వాతావరణం బలంగా ఉంది. గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం, సులభతర రుణ వసతులు, ప్రత్యామ్నాయ ఇంధన (ఈవీ, సీఎన్జీ) వాహనాలకు ఆదరణ పెరగడం ఆటో రంగానికి కలిసివచ్చింది. రాబోయే పండుగల సీజన్ డిమాండ్ ఈ త్రైమాసికం (క్యూ2) వాహన విక్రయాలను మరింత పెంచుతందనే నమ్మకముంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు.


