మనుషుల ఉనికికి కృత్రిమ మేధ (ఏఐ) ముప్పుగా మారొచ్చన్న హెచ్చరికలు ఇప్పటివి కాదని.. 471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో చెప్పారని ‘వియాన్’ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. 1555లో ప్రచురించిన Les Prophéties పుస్తకంలో భవిష్యత్తులో ఓ సాంకేతికత.. ప్రపంచాన్ని ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలున్నాయని దానిలో పేర్కొంది. ఏఐపై భయాలు ఇటీవలి కాలంలో అందరినీ చుట్టుముడుతున్నాయి. ఏఐ సంస్థ ఆంత్రోపిక్లో పనిచేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్, ఈ సాంకేతికత 2030 నాటికే మానవాళికి తీవ్ర ముప్పు కలిగించవచ్చని హెచ్చరించారు. నోస్ట్రడామస్ 1555లో రాసిన ఒక పుస్తకంలో ‘కొత్త జ్ఞాని’, ‘ఒంటరి మెదడు’, ‘అమరత్వం’, ‘శిష్యులు’ వంటి పదాలు కనిపించాయి. వీటిని కొందరు కంప్యూటర్లు, అప్లోడ్ చేసిన మైండ్ లేదా మెషీన్ ఇంటెలిజెన్స్కు సంబంధించినవిగా అన్వయిస్తున్నారు.
నోస్ట్రడామస్ అనుచరులు గతంలో 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఘటనలను కూడా ఆయన ప్రవచనాలతో అనుసంధానించారు. తాజాగా కాక్సన్ హెచ్చరికలను కూడా ఆ సందేశంతో కలిపి చూస్తున్నారు. బల్గేరియన్ మిస్టిక్ బాబా వంగా కూడా 2026లో ఏఐ కీలక రంగాలను ప్రభావితం చేసి, అనేక ఉద్యోగాలను భర్తీ చేస్తుందని చెప్పినట్లు ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. అయితే ఈ వాదనలకు స్పష్టమైన ఆధారాలు లేవని కొందరు అంటారు. సెప్టెంబర్ 9న ఎక్స్లో కాక్సన్ చేసిన పోస్టులో ఏఐ సంస్థలు స్వీయ అభివృద్ధి చేసుకునే సూపర్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా సాగుతున్నాయని, ఇది మానవ జీవితాలతో ప్రమాదకరంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. దశాబ్దం ముగిసేలోపు ఏఐ మానవాళికి అస్తిత్వ ముప్పుగా మారొచ్చని పలువురు పరిశోధకులు భావిస్తున్నారని తెలిపారు.
సూపర్హ్యూమన్ ఏఐ వ్యవస్థలు మౌలిక వసతులను హ్యాక్ చేయడం, వాస్తవ ప్రపంచ వనరులను సంపాదించడం, ప్రమాదకర జీవ పరిశోధనలను వేగవంతం చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కాక్సన్ హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు Anthropic అలైన్మెంట్ సైన్స్ విభాగం నేత ఇవాన్ హ్యూబింగర్ మద్దతు పలికారు. ఏఐ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో, కీలకమైన రక్షణ చర్యలు లేకపోతే వచ్చే పదేళ్లలో మానవులు అంతరించిపోయే ప్రమాదం 10 శాతానికి పైగా ఉండొచ్చని హ్యూబింగర్ అంచనా వేశారు.
ఇదీ చదవండి: ‘ఎంఎస్’ జీవితాన్ని మలుపుతిప్పిన సదాశివం


