స్టాక్ బ్రోకింగ్ దిగ్గజం బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్లో వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ 15 పార్ట్నర్స్ తాజాగా 1.46 శాతం వాటా విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం షేరుకి రూ. 191.5 సగటు ధరలో 9,17,14,208 షేర్లు అమ్మివేసింది.
వీటి విలువ రూ. 1,756 కోట్లుకాగా.. గ్రో బ్రాండుతో స్టాక్ బ్రోకింగ్ సర్వీసులందించే కంపెనీలో పీక్ 15 పార్ట్నర్స్ వాటా 15.68 శాతం నుంచి 14.22 శాతానికి క్షీణించింది. అయినప్పటికీ బ్రెయిన్ గ్యారేజ్లో పీక్ 15 అతిపెద్ద పబ్లిక్ వాటాదారుగా నిలుస్తుండటం గమనార్హం! అయితే గ్రో షేర్ల కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు.
ఈ ఏడాది ఆగస్ట్లో స్టార్టప్ యాక్సిలేటర్ సంస్థ వై కాంబినేటర్ సైతం గ్రోలో 1.2 శాతం వాటాను రూ. 1,435 కోట్లకు విక్రయించింది. ఇదేవిధంగా జూన్లో ఫ్రియాలే రూ. 210 కోట్లకు 1.13 కోట్ల షేర్లు విక్రయించగా.. అంతకుముందు మేలో పీక్ 15, రిబ్బిట్ క్యాపిటల్, వై కాంబినేటర్ ఉమ్మడిగా 4.71 శాతం వాటాను రూ. 5,326 కోట్లకు అమ్మివేసిన విషయం విదితమే.


