బ్యాంకుల నుంచి రూ. 2.40 లక్షల కోట్లు వెనక్కి.. | RBI absorbs Rs 2 40 lakh Crore Banks VRRR Auction Surplus Liquidity | Sakshi
Sakshi News home page

బ్యాంకుల నుంచి రూ. 2.40 లక్షల కోట్లు వెనక్కితీసుకున్న ఆర్బీఐ

Sep 17 2026 5:39 PM | Updated on Sep 17 2026 6:02 PM

RBI absorbs Rs 2 40 lakh Crore Banks VRRR Auction Surplus Liquidity

బ్యాంకింగ్‌ వ్యవస్థలో భారీగా ఉన్న అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) ఉపసంహరించుకునే చర్యల్లో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గురువారం రూ.2.40 లక్షల కోట్లను సమీకరించింది. వేరియబుల్‌ రేట్‌ రివర్స్‌ రెపో (వీఆర్ఆర్‌ఆర్‌) వేలం ద్వారా బ్యాంకుల నుంచి ఈ నిధులను కేంద్ర బ్యాంక్‌ తీసుకుంది.

వీఆర్ఆర్‌ఆర్‌ వేలంలో మొత్తం రూ.2,39,959 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. వీటన్నింటినీ 5.24 శాతం కటాఫ్‌ రేటుతో, అదే వెయిటెడ్‌ యావరేజ్‌ రేటుతో ఆర్బీఐ పూర్తిగా ఆమోదించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనంగా ఉన్న నిధులను తాత్కాలికంగా ఉపసంహరించుకోవడంతో పాటు, ఓవర్‌నైట్‌ మనీ మార్కెట్‌ రేట్లను రెపో రేటుకు అనుగుణంగా ఉంచడం వీఆర్ఆర్‌ఆర్‌ వేలం ప్రధాన ఉద్దేశం.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ సెప్టెంబర్‌ 16 నాటికి సుమారు రూ.7.38 లక్షల కోట్ల మిగులులో ఉన్నట్లు అంచనా. దీంతో ఈ అదనపు నిధులను దశలవారీగా వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకునే చర్యలను ఆర్బీఐ కొనసాగిస్తోంది. గత నెల నుంచి కేంద్ర బ్యాంక్‌ పలు విడతల్లో వీఆర్ఆర్‌ఆర్‌ వేలాలను నిర్వహిస్తోంది.

మరో రూ.1 లక్ష కోట్ల ఉపసంహరణ

వీఆర్ఆర్‌ఆర్‌ చర్యలకు అదనంగా ప్రభుత్వ సెక్యూరిటీల ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్‌ (ఓఎంఓ) విక్రయాల ద్వారా కూడా వ్యవస్థలోని లిక్విడిటీని తగ్గించేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. మొత్తం రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను మూడు విడతల్లో విక్రయించనున్నట్లు గత వారం ప్రకటించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 17న రూ.50,000 కోట్లు, సెప్టెంబర్‌ 21, 28 తేదీల్లో చెరో రూ.25,000 కోట్ల విలువైన సెక్యూరిటీల విక్రయాన్ని చేపట్టనుంది.

ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్ల ప్రభావం

ఇటీవలి కాలంలో బ్యాంకులు ఫారిన్‌ కరెన్సీ నాన్‌-రెసిడెంట్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ) డిపాజిట్లను పెద్ద ఎత్తున సమీకరించడం కూడా బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ పెరగడానికి ఒక కారణంగా మారింది. విదేశీ కరెన్సీ దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత, ఆర్బీఐతో చేపట్టిన తదుపరి మారక లావాదేవీల ద్వారా బ్యాంకులకు రూపాయి నిధులు అందుబాటులోకి వచ్చాయి.

దీనికి తోడు నెలాఖరు ప్రభుత్వ వ్యయం కూడా వ్యవస్థలో నగదు లభ్యతను పెంచుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులు వంటి ప్రభుత్వ వ్యయాల ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి నిధులు చేరుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అదనపు లిక్విడిటీని క్రమబద్ధీకరించేందుకు ఆర్బీఐ వీఆర్ఆర్‌ఆర్‌, ఓఎంఓ వంటి సాధనాలను ఉపయోగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement