పేపర్‌ నోట్ల స్థానే ప్లాస్టిక్‌ నోట్లు! ప్రభుత్వం వివరణ | Currency Notes Ban Rumor Fact Check on Plastic Money | Sakshi
Sakshi News home page

పేపర్‌ నోట్ల స్థానే ప్లాస్టిక్‌ నోట్లు! ప్రభుత్వం వివరణ

Jun 12 2026 3:06 PM | Updated on Jun 12 2026 3:15 PM

Currency Notes Ban Rumor Fact Check on Plastic Money

‘జూన్ 30 తర్వాత మీ జేబులోని కాగితపు కరెన్సీ నోట్లు చెల్లవు.. వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి’— ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో వైరల్‌ అవుతున్న ఒక పోస్ట్ సారాంశం ఇది. 2016 నాటి నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఈ వార్త వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిజంగానే కాగితపు నోట్లను నిషేధిస్తోందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటోంది? అనే అంశాలను కింద చూద్దాం.

వైరల్ అవుతున్న పోస్ట్‌లో ఏముంది?

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్టుల ప్రకారం.. జూన్ 30, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అదే తేదీ నుంచి వాటి స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ (పాలిమర్ నోట్లు) అమల్లోకి వస్తుందని ఆ పోస్టుల సారాంశం.

పీఐబీ ఫ్యాక్ట్ చెక్

ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఈ వాదనను పూర్తిగా నకిలీ (ఫేక్‌ న్యూస్‌) అని కొట్టిపారేసింది. ‘జూన్ 30, 2026 నాటికి కాగితపు నోట్లను దశలవారీగా తొలగించే లేదా వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఎలాంటి ప్రణాళికలు ఆర్‌బీఐ వద్ద లేవు. వివిధ సామాజిక గ్రూపుల్లో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని, ఫార్వార్డ్ మెసేజ్‌లను గుడ్డిగా నమ్మవద్దు’ అని ప్రభుత్వం కోరింది. కరెన్సీకి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా నేరుగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.

పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యలు

ఇటీవల (జూన్ 5, 2026న) జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ‘పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే. మేము దాని వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాం. అయితే, ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement