
ఐటీ సర్వీసులు అందించే ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ తన భారత కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రూ.1,583 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక టెక్నాలజీ క్యాంపస్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. వైజాగ్లోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 22 ఎకరాల్లో మూడు దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్యాంపస్ ద్వారా 8,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది.
2026లో 800 మంది అసోసియేట్లకు వసతి కల్పించేలా తాత్కాలిక కేంద్రం ద్వారా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. 2029 ప్రారంభంలో పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. విశాఖపట్నం ప్రతిభకు, మౌలిక సదుపాయాలకు ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవి కుమార్ తెలిపారు. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సంస్థ విస్తరించాలనే లక్ష్యానికి అనుగుణంగా వైజాగ్లో క్యాంపస్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేస్తుందని, అదే సమయంలో భవిష్యత్తులో శ్రామిక శక్తికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచుతుందని ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశం
భారతదేశం అంతటా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్ ఇప్పటికే భువనేశ్వర్, ఇండోర్లో కొత్త కేంద్రాలను, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ హబ్ను ఏర్పాటు చేసిందని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికి పైగా కంపెనీ శ్రామిక శక్తి భారత్లో ఉన్నందున కాగ్నిజెంట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది.