ఆన్‌లైన్‌ ఫార్మసీలకు చెక్‌! | Center plans to tighten regulations on online pharmacies | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ఫార్మసీలకు చెక్‌!

Jun 24 2025 5:24 AM | Updated on Jun 24 2025 9:44 AM

Center plans to tighten regulations on online pharmacies

వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు 

నిబంధనలను కఠినతరం చేసే యోచనలో కేంద్రం 

దేశీయంగా రూ. 2.4 లక్షల కోట్ల రిటైల్‌ ఫార్మసీ మార్కెట్‌ 

అందులో ఈ–ఫార్మసీలకు 3–5 శాతం వాటా

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ ఫార్మసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే టాటా 1ఎంజీ, ఫార్మ్‌ఈజీ, నెట్‌మెడ్స్‌లాంటి దిగ్గజ ప్లాట్‌ఫాంలు వేగంగా విస్తరిస్తుండటంతో పాటు కొత్తగా మరిన్ని పుట్టుకొస్తున్నాయి. పేమెంట్‌ సేవల సంస్థ ఫోన్‌పేకి చెందిన పిన్‌కోడ్‌ ఈ మధ్య బెంగళూరు, పుణే, ముంబైలో 10 నిమిషాల్లోనే ఔషధాల డెలివరీ సరీ్వసును ప్రారంభించింది. ఇక ప్రైవేట్‌ ఫార్మసీ చెయిన్‌ దవా ఇండియా సంస్థ పుణేలో 60 నిమిషాల్లో డెలివరీ సేవలు అందిస్తోంది. 

అటు ఓటీపీ వెంచర్స్‌ నుంచి 2.4 మిలియన్‌ డాలర్లు సమీకరించిన జీల్యాబ్‌ ఫార్మసీ కూడా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌)లో 60 నిమిషాల్లో ఔషధాలు అందిస్తోంది. వీటిలో కొన్ని ప్లాట్‌ఫాంలు కస్టమర్లను సమీపంలోని మెడికల్‌ స్టోర్స్‌తో అనుసంధానం చేస్తుండగా, మరికొన్ని తమ డార్క్‌ స్టోర్స్‌ (గిడ్డంగులు) ద్వారా వినియోగదారులకు నేరుగా ఔషధాలను అందిస్తున్నాయి.  

ఔషధాలతో పాటు మెడికల్‌ పరికరాలు, ఇతరత్రా అధిక మార్జిన్‌ ఉండే ఉత్పత్తులు మొదలైనవి విక్రయిస్తున్నాయి. అయితే, సదరు సంస్థలు సత్వరం ఔషధాలను అందిస్తున్నప్పటికీ కొన్ని విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. ఔషధాల ప్రిస్కిప్షన్, ఆర్డర్‌ ఇచ్చిన వారి వయస్సు మొదలైన వివరాలను ఈ–ఫార్మసీలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఇవి మరింతగా పెరిగాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఫార్మసీల నిబంధనలను కఠినతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాయి.

హోమ్‌ డెలివరీని నిలిపివేయాలి: ఏఐవోసీడీ ఇంటివద్దకే ఔషధాల సరఫరా సేవలను తక్షణం నిలిపివేయాలంటూ ఆలిండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ (ఏఐవోసీడీ) డిమాండ్‌ చేస్తోంది. కోవిడ్‌ సమయంలో అత్యవసర వేళల్లో పేషెంట్ల సౌకర్యార్థం ఈ సరీ్వసులను ప్రవేశపెట్టారని, ప్రస్తుతం అటువంటి అత్యవసర పరిస్థితుల్లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. 

ఏఐవోసీడీలో ప్రస్తుతం 12.4 లక్షల మంది కెమిస్టులు, డ్రగ్గిస్టులు సభ్యులుగా ఉన్నారు. క్రిసిల్‌ నివేదిక ప్రకారం దేశీయంగా మొత్తం రిటైల్‌ ఫార్మసీ మార్కెట్‌ 2.4 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో అసంఘటిత విభాగం వాటా 85 శాతంగా ఉంది. ఆన్‌లైన్‌ ఫార్మసీల వాటా 3–5 శాతంగా ఉంది. కొన్ని సంపన్న దేశాల్లో ఇది 22–25 శాతం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఫార్మసీ మార్కెట్‌ మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

కొత్త చట్టంపై ప్రభుత్వం కసరత్తు.. 
సత్వరం ఔషధాలను అందిస్తున్న ఈ–ఫార్మసీల నియంత్రణకు ప్రస్తుతం నిర్దిష్ట చట్టం అంటూ లేదు. డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ నిబంధనలు ఆన్‌లైన్‌ ఫార్మసీలకు నిర్దిష్టంగా చట్టబద్ధత కల్పించకపోవడం, స్పష్టత లోపించడం వల్ల, ప్రస్తుత నిబంధనల స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఔషధాల ఆన్‌లైన్‌ అమ్మకాలను కూడా చేరుస్తూ డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ రూల్స్‌ 1945ని మార్చేలా 2018లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా  సవరణలను ప్రతిపాదించింది. వీటిపై తమకేవైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే తెలియజేయాలంటూ ఓ నోటిఫికేషన్‌లో సంబంధిత వర్గాలను కోరింది. అయితే, ఈ నోటిఫికేషన్‌ను కెమిస్టుల సమాఖ్య సుప్రీం కోర్టులో సవాలు చేసింది. 2018 డిసెంబర్‌లో లైసెన్సు లేని ఆన్‌లైన్‌ ఫార్మసీలు ఔషధాలను విక్రయించడంపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement