కొత్త స్కామ్‌.. ఓటీపీ చెప్పకపోయినా ఖాతా ఖాళీ! | Call Merging Scam You May Lose Money Without Sharing OTP | Sakshi
Sakshi News home page

కొత్త స్కామ్‌.. ఇలాంటి కాల్‌ వస్తే ఓటీపీ చెప్పకపోయినా ఖాతా ఖాళీ!

Feb 20 2025 3:50 PM | Updated on Feb 20 2025 8:42 PM

Call Merging Scam You May Lose Money Without Sharing OTP

సైబర్‌ మోసాలు (Cyber Scam) రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకూ చేతికి చిక్కిన ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సైబర్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని అప్రమత్తంగా ఉండకపోతే మన వంతు వచ్చినప్పుడు మోసపోయి బాధపడక తప్పదు.

కాల్ మెర్జింగ్ స్కామ్ (Call Merging Scam) అనేది ఇప్పుడు ఒక కొత్త రకమైన సైబర్ మోసం. దీనిలో స్కామర్లు కాల్స్‌ను మెర్జ్‌ చేసి బాధితులు ఓటీపీలు (OTP) చెప్పకపోయినా వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని రాబట్టి వారి ఖాతాలు ఖాళీలు చేస్తున్నారు. మోసగాళ్ళు బ్యాంక్ ప్రతినిధులు లేదా స్నేహితులు వంటి విశ్వసనీయ వ్యక్తులుగా నటిస్తూ బాధితులను మూడవ కాల్‌ను మెర్జ్‌ చేయమని అభ్యర్థిస్తారు. ఈ కాల్ సాధారణంగా ఆటోమేటెడ్ ఓటీపీ సర్వీస్‌. స్కామర్లు దీనిని బాధితుడి బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ (UPI) వాలెట్‌కు అనధికార యాక్సెస్‌ పొందడానికి ఉపయోగిస్తారు.

ఇలా స్కామ్‌ చేస్తున్నారు.. 
» స్కామర్ బాధితుడికి ఫోన్‌ చేసి స్నేహితుడు, కంపెనీ లేదా బ్యాంకు ప్రతినిధినని నమ్మిస్తారు.
» వెంటనే మరొక కాల్‌లో (కాల్‌ మెర్జ్‌) చేరమని బాధితులను అడుగుతారు.
» రెండవ కాల్ ఆటోమేటెడ్. ఇది లావాదేవీకి ఓటీపీని అందిస్తుంది.
» స్కామర్‌ ఓటీపీ విని బాధితుడి ఖాతాలోకి ప్రవేశిస్తాడు. 
» బాధితుడు అప్రమత్తం అయ్యేలోపే ఖాతా ఖాళీ అవుతుంది.

వాస్తవ సంఘనలు
ఇటీవల, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెరుగుతున్న కాల్ మెర్జింగ్ స్కామ్‌ల గురించి సోషల్ మీడియాలో హెచ్చరించింది. మెర్జ్‌ కాల్స్‌ ద్వారా తమకు తెలియకుండానే ఓటీపీలు వెల్లడి కావడం వల్ల చాలా మంది బాధితులు వేలాది రూపాయలు కోల్పోతున్నారని పేర్కొంది.

ఇదీ చదవండి: త్వరలో ప్రభుత్వ క్రెడిట్‌ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్‌తో..

ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తకు బ్యాంకు మోసాలను గుర్తించే బృందం నుంచి అంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి బాధితుడిని మాటల్లో పెట్టి ఓటీపీని వెల్లడించే మరో కాల్‌కి మెర్జ్‌ చేయించాడు. నిమిషాల్లోనే అతని ఖాతా ఖాళీ అయింది.

స్కామ్‌లకు గురికాకుండా చేయవలసినవి
» కాల్‌ను మెర్జ్‌ చేయమని అడుగుతున్న వ్యక్తి ఐడెంటిటీని పరిశీలించండి.
» ఎవరైనా ఊహించని విధంగా కాల్‌ను మెర్జ్‌ చేయమని అడిగితే, వెంటనే తిరస్కరించండి.
» మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లలో ట్రాన్సాక్షన్‌ అలర్ట్స్‌ను యాక్టివేట్‌ చేయండి.
» స్కామ్‌ కాల్‌ అని అనుమానం వస్తే 1930 ( సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ) కు కాల్ చేయండి లేదా మీ బ్యాంకుకు తెలియ జేయండి.

చేయకూడనివి
» తెలియని నంబర్లతో కాల్స్‌ను ఎప్పుడూ మెర్జ్‌ చేయవద్దు. ఈ స్కామ్‌లో ఉపయోగించే ప్రాథమిక ట్రిక్ ఇది.
» ఓటీపీలను షేర్ చేయవద్దు. ఏ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ కాల్ ద్వారా ఓటీపీని అడగదు.
» తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఫిషింగ్ లింక్‌లను మోసగాళ్ళు పంపవచ్చు. ఇది భద్రతను మరింత దెబ్బతీస్తుంది.
» కాలర్ ఐడీలను గుడ్డిగా నమ్మవద్దు. స్కామర్‌లు చట్టబద్ధంగా కనిపించే స్పూఫ్డ్ నంబర్‌లను ఉపయోగించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement