
న్యూఢిల్లీ: మాతృ సంస్థ, బ్రిటిష్ దిగ్గజం బ్రిటిష్ అమెరికన్ టొబాకో(బీఏటీ) తాజాగా దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీలో మైనారిటీ వాటా విక్రయించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో బ్లాక్డీల్స్ ద్వారా 2.5 శాతం వాటా అమ్మివేసింది. షేరుకి రూ. 413కుపైగా సగటు ధరలో 31.3 కోట్ల షేర్లను విక్రయించింది. వీటి విలువ రూ. 12,941 కోట్లు(1.51 బిలియన్ డాలర్లు)కాగా.. ఎన్ఎస్ఈలో మంగళవారం ధర రూ. 434తో పోలిస్తే 4.8 శాతం డిస్కౌంట్లో వాటాను ఆఫర్ చేసింది.
కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ లావాదేవీకి ముందు కంపెనీలో బీఏటీ వాటా 25.44 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థల ద్వారా ప్రస్తుతం 22.94 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ఐటీసీలో 1900 సంవత్సరం ప్రారంభంలోనే బీఏటీ పెట్టుబడులకు తెరతీసింది.
తద్వారా దీర్ఘకాలంగా రెండు దిగ్గజాలూ లబ్ధి పొందుతూ వస్తున్నాయి. అయితే 2024 మార్చిలోనూ ఐటీసీలో 3.5 శాతం వాటాను రూ. 17,485 కోట్లకు బీఏటీ విక్రయించడం గమనార్హం! బ్లాక్డీల్ నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో బుధవారం 3.2 శాతం క్షీణించి రూ. 420 వద్ద ముగిసింది.