టోల్ ప్లాజాల్లో కొత్త విధానం.. వాహనదారులకు భారీ ఊరట! | Barrier Free Toll Booths on National Highways by March 2027 Says Nitin Gadkari | Sakshi
Sakshi News home page

టోల్ ప్లాజాల్లో కొత్త విధానం.. వాహనదారులకు భారీ ఊరట!

Sep 12 2026 6:38 PM | Updated on Sep 12 2026 6:57 PM

Barrier Free Toll Booths on National Highways by March 2027 Says Nitin Gadkari

దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.20,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు అదనపు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సెప్టెంబర్ 11న ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల కోసం ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నారు. వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా టోల్ మొత్తాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో చెల్లించేందుకు ఇది ఉపయోగపడుతోంది. దీని వల్ల టోల్ వసూళ్లలో కూడా గణనీయమైన మార్పు వచ్చిందని గడ్కరీ తెలిపారు. ఫాస్ట్‌ట్యాగ్ అమలు తర్వాత టోల్ ప్లాజాల ఆదాయం సుమారు 10 శాతం పెరిగి, గతంలో ఉన్న రూ.7,000 కోట్ల స్థాయి నుంచి ప్రస్తుతం రూ.82,000 కోట్లకు పైగా చేరిందని వెల్లడించారు.

బ్యారియర్-ఫ్రీ టోల్ ప్లాజాలు
రానున్న రోజుల్లో.. బ్యారియర్-ఫ్రీ టోల్ ప్లాజాలు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా టోల్ వసూలు చేసే ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే మరో 10 శాతం మేర ఆదాయం పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీని ద్వారా అదనంగా రూ.7,000 కోట్ల నుంచి రూ.8,000 కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేశారు.

టోల్ ప్లాజాలను నిర్వహించే ఖర్చు కూడా గణనీయంగా తగ్గిందని గడ్కరీ చెప్పారు. గతంలో టోల్ వసూళ్ల నిర్వహణకు దాదాపు 12 శాతం వరకు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం అది కేవలం 2 నుంచి 3 శాతానికి తగ్గిందని తెలిపారు. అంటే.. టెక్నాలజీ ఆధారిత టోల్ వసూళ్ల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గుతోందని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది మార్చి నాటికి
బ్యారియర్-ఫ్రీ టోల్ విధానం విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని 70 శాతానికి పైగా టోల్ ప్లాజాలను బ్యారియర్-ఫ్రీగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది.. మార్చి నాటికి జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను ఈ విధానంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మార్పులతో వాహనదారులకు కూడా ప్రయోజనం కలగనుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఉండాల్సిన పరిస్థితి తగ్గడంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా.. ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గడం వల్ల వాహనదారులు ఏడాదికి సుమారు రూ.5,250 కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేస్తున్నారని అధ్యయనాలను ఉటంకిస్తూ గడ్కరీ తెలిపారు.

ట్రక్కుల్లో ఓవర్‌ లోడింగ్‌ను గుర్తించే టెక్నాలజీని కూడా అభివృద్ధి చేయాలని మంత్రి టెక్నాలజీ రంగానికి పిలుపునిచ్చారు. భారీగా సరుకులు మోసే ట్రక్కులు నిర్ణీత పరిమితికి మించి బరువుతో ప్రయాణిస్తే రహదారుల భద్రతతో పాటు రోడ్ల నాణ్యతపై కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల ఓవర్‌లోడింగ్‌ను సులభంగా గుర్తించే సాంకేతిక పరిష్కారాలు అవసరమని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: FASTagలో వన్‌ట్యాగ్.. బ్యాంక్ మార్చినా స్టిక్కర్ మారదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement