కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ట్యాగ్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై వాహనానికి ఉన్న ఫాస్ట్ట్యాగ్ స్టిక్కర్ను తొలగించి కొత్తది తీసుకోవాల్సిన అవసరం లేకుండానే.. బ్యాంకును మార్చుకునే అవకాశం కలగనుంది. దీనికోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వన్ట్యాగ్ (OneTag) పేరుతో కొత్త పోర్టుబిలిటీ వ్యవస్థను ప్రారంభించింది. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026లో ఈ వ్యవస్థను ప్రారంభించారు.
ఇదివరకు ఫాస్ట్ట్యాగ్ జారీ చేసిన బ్యాంకును మార్చుకోవాలంటే ముందుగా ఉన్న ఫాస్ట్ట్యాగ్ ఖాతాను క్లోజ్ చేసి.. కొత్తగా మరో ఫాస్ట్ట్యాగ్ తీసుకోవాల్సి ఉండేది. అయితే వన్ట్యాగ్ ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది. వినియోగదారులు తమ వాహనానికి ఇప్పటికే ఉన్న ఫాస్ట్ట్యాగ్ కొనసాగిస్తూ, అదే ట్యాగ్ ఐడీ, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబరరుతో మరో బ్యాంకుకు మారవచ్చు. అంటే కొత్త ఫాస్ట్ట్యాగ్ స్టిక్కర్ను వాహనంపై అతికించాల్సిన అవసరం ఉండదు.
ఈ కొత్త విధానాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రోత్సహించే ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ సదుపాయం ఎన్హెచ్ఏఐకి చెందిన రాజ్మార్గ్ యాత్ర మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
బ్యాంక్ మార్చుకోవాలనుకునే వినియోగదారులు ముందుగా ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని, వెరిఫికేషన్ పూర్తి చేసి, తమ సమ్మతి తెలిపి, కొత్తగా కోరుకున్న బ్యాంక్ ఎంచుకోవాలి. ఆ తర్వాత కొత్త బ్యాంకుతో ఆన్ బోర్డింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
బ్యాంక్ మారిన తర్వాత పాత ఫాస్ట్ట్యాగ్కు సంబంధించిన బాధ్యతలు పూర్తిగా కొత్త బ్యాంకుకు వెంటనే వెళ్లవు. పాత బ్యాంకే కస్టమర్ వెరిఫికేషన్, పాత వాలెట్లోని రీఫండ్స్, పెండింగ్ లావాదేవీలు వంటి అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తరువాత కొత్త బ్యాంక్ నుంచి లావాదేవీలు జరుగుతాయి.
ఇదీ చదవండి: టోల్ వసూళ్లకు కొత్త ప్లాన్.. గడ్కరీ కీలక ప్రకటన!


