డ్రైవింగ్‌ లైసెన్స్‌కు కొత్త విధానం.. కీలక ప్రతిపాదనలు | Centre Plans New Points System Driving Licence Proposes Nitin Gadkari | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు కొత్త విధానం.. కీలక ప్రతిపాదనలు

Sep 4 2026 1:37 PM | Updated on Sep 4 2026 2:04 PM

Centre Plans New Points System Driving Licence Proposes Nitin Gadkari

ట్రాఫిక్‌ నిబంధనలు పదేపదే ఉల్లంఘించే వాహనదారులకు ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లకు గ్రేడెడ్‌ పాయింట్ల విధానం తీసుకొచ్చే అంశాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (SIAM) 66వ వార్షిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఉల్లంఘనలకు పాయింట్లు..

ప్రతిపాదిత విధానంలో ప్రతి ట్రాఫిక్‌ ఉల్లంఘనకు డ్రైవింగ్‌ రికార్డులో ప్రతికూల పాయింట్లు నమోదవుతాయి. ఒక నిర్దిష్ట పరిమితికి ఈ పాయింట్లు చేరితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏ నేరానికి ఎన్ని పాయింట్లు, ఎంత పరిమితికి ఏ చర్య అనే పూర్తి నిబంధనలను ప్రభుత్వం వెల్లడించలేదు.

అంటే వేగంగా వాహనం నడపడం, సిగ్నల్‌ జంప్‌ చేయడం, ప్రమాదకర డ్రైవింగ్‌ వంటి ఉల్లంఘనలు ఒక్కోసారి జరిమానాతో ముగిసిపోకుండా.. డ్రైవర్‌ మొత్తం రికార్డుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ విధానం ఉద్దేశం.

మంచి డ్రైవర్లకు ప్రోత్సాహకాలు

ఈ విధానం కేవలం శిక్షలకు పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా వాహనం నడిపే వారికి ప్రోత్సాహకాలు అందించేలా ఉండొచ్చని గడ్కరీ తెలిపారు. మంచి డ్రైవింగ్‌ రికార్డు ఉన్నవారికి బీమా సంస్థల నుంచి ప్రోత్సాహకాలు లేదా ఇతర ప్రయోజనాలు లభించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలు ఎలా ఉంటాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

రోడ్డు భద్రతపై పెరుగుతున్న ఆందోళన

డ్రైవర్‌ ప్రవర్తన దేశంలో రోడ్డు భద్రతకు ప్రధాన సవాలుగా ఉందని గడ్కరీ పేర్కొన్నారు. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా 5,13,563 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో సుమారు 1.83 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున ప్రతి గంటకు దాదాపు 59 ప్రమాదాలు, 21 మరణాలు నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 2025లో రోడ్డు ప్రమాద మరణాల్లో ద్విచక్ర వాహనదారుల వాటా 46.2 శాతంగా ఉంది.

ఈ నేపథ్యంలో వాహనాల భద్రతతో పాటు డ్రైవింగ్‌ ప్రవర్తనపైనా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0ను 2027 అక్టోబర్‌ నుంచి అమలు చేయాలని యోచిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఇందులో వాహనం క్రాష్‌ పనితీరుతో పాటు ప్రమాద నివారణ, పాదచారుల భద్రత, ప్రమాదం తర్వాత రక్షణ వంటి అంశాలనూ విస్తృతంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

బైక్‌ ట్యాక్సీలకు గడ్కరీ మద్దతు

ఇదే సమయంలో ప్రైవేట్‌ ద్విచక్ర వాహనాలను బైక్‌ ట్యాక్సీలుగా నడిపేందుకు రాష్ట్రాలు అనుమతించాలని గడ్కరీ కోరారు. రవాణా రంగం రాష్ట్రాల పరిధిలో ఉండటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సేవలకు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో ఇది అదనపు ఆదాయ మార్గంగా మారవచ్చని, దాదాపు 8 కోట్ల మందికి జీవనోపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం ఈ రంగానికి ఉందని ఆయన అన్నారు.

అంతేకాకుండా హైవేలు, మైనింగ్‌ వంటి అధిక ప్రమాద రంగాల్లో పనిచేసే డ్రైవర్లు, కార్మికుల కోసం ‘సురక్ష’ పైలట్‌ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. తొలిదశలో నాగ్‌పూర్‌–కాంప్టీ ప్రాంతంలోని NH-44తో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్‌ మైనింగ్‌ ప్రాంతంలో సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో 10 వేల మందికి వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్‌ అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement