డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎంత పెరిగినప్పటికీ బ్యాంకు శాఖకు వెళ్లి నగదు డిపాజిట్, చెక్ క్లియరెన్స్, పాస్బుక్ అప్డేట్ వంటి పనులు చేసుకునే ఖాతాదారులు ఇప్పటికీ చాలా మందే ఉంటారు. ఇలాంటివారు ముందుగా బ్యాంకు సెలవుల షెడ్యూల్ను తెలుసుకోవడం మంచిది. ఈ సెప్టెంబర్ 14 నుంచి 20 మధ్య దేశంలోని బ్యాంకులు నాలుగు రోజులు మూతపడనున్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలు, నగరాలకు ఒకే విధంగా వర్తించవు. స్థానిక పండుగలు, ప్రత్యేక సందర్భాలను బట్టి సెలవులు మారుతాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తదితర బ్యాంకుల శాఖలకు ఈ సెలవుల షెడ్యూల్ వర్తిస్తుంది. సెలవు ఉన్న ప్రాంతాల్లో బ్రాంచ్ ఆధారిత సేవలు అందుబాటులో ఉండవు. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, యూపీఐ ద్వారా సాధారణంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఏ తేదీన.. ఎక్కడ సెలవు?
సెప్టెంబర్ 14, సోమవారం: గణేష్ చతుర్థి, గణేష్ పూజ, వరసిద్ధి వినాయక వ్రత, వినాయక చతుర్థి, వినాయకర్ చతుర్థి, హర్తాలిక తదితర పండుగల సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్పూర్, పనాజీ, విజయవాడ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 15, మంగళవారం: సంవత్సరి, నువాఖై, గణేష్ చతుర్థి రెండో రోజును పురస్కరించుకుని అహ్మదాబాద్, భువనేశ్వర్, పనాజీ నగరాల్లోని బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 18, శుక్రవారం: యూనిటేరియన్ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా షిల్లాంగ్లో బ్యాంకు శాఖలు పనిచేయవు.
సెప్టెంబర్ 20, ఆదివారం: వారాంతపు సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసిఉంటాయి.
అంటే సెప్టెంబర్ 14, 15, 18 తేదీల్లో ప్రాంతాల వారీగా బ్యాంకులకు సెలవులు ఉండగా.. సెప్టెంబర్ 20న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు పనిచేయవు.
దేశంలో బ్యాంకుల సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించే సెలవుల క్యాలెండర్ ఆధారంగా నిర్ణయిస్తారు. స్థానిక పండుగలు, ప్రాంతీయ ఆచారాల కారణంగా రాష్ట్రాలు, నగరాల మధ్య సెలవుల్లో వ్యత్యాసం ఉంటుంది. జాతీయ సెలవు దినాల్లో మాత్రం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసిఉంటాయి.
ఇదీ చదవండి: UPI కొత్త ఫీచర్లు.. ఫోన్ డేటా లేకున్నా పేమెంట్!


