భారత్‌లో యాపిల్‌ బిజినెస్‌ బ్రహ్మాండం.. మరిన్ని స్టోర్‌లను ప్రారంభించనున్న సీఈవో టిమ్‌ కుక్‌!

Apple Open New Flagship Stores With Focus On India, China And South Korea - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రపంచ దేశాల రిటైల్‌ మార్కెట్‌పై దృష్టిసారించింది. ప్రస్తుతం, దేశీయంగా జరుగుతున్న ఊహించని బిజినెస్‌తో భారత్‌లో మరో మూడు స్టోర్లతో పాటు చైనా, ఆసియా, అమెరికా, యూరప్‌ దేశాలలో రీటైల్‌ స్టోర్‌లను ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదించింది. 

అయితే, తాజాగా యాపిల్‌ కీలక నిర్ణయానికి కారణం భారత్‌ మార్కెటేనని సమాచారం. ఇప్పటికే ఆ సంస్థ 26 దేశాల్లో 520 స్టోర్‌ల నుంచి ఉత్పత్తుల్ని విక్రయించింది. రానున్న రోజుల్లో మరో 53 రీటైల్‌ స్టోర్‌లను ప్రారంభించేలా భారత్‌లోని యాపిల్‌ స్టోర్‌లు దారి చూపినట్లు టెక్‌ పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

  

కుపెర్టినో దిగ్గజం ఈ ఏడాది భారత్‌లో ఢిల్లీ, ముంబైలలో యాపిల్‌ రీటైల్‌ స్టోర్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవానికి సీఈవో టిమ్‌కుక్‌ హాజరయ్యారు. అయితే ఇటీవల ఈ రెండు స్టోర్‌లలోని యాపిల్‌ ఉత్పత్తుల అమ్మకాలు సరికొత్త రికార్డ్‌లను నమోదు చేస్తున్నాయి. రోజుల వ్యవధిలో ఈ రెండు స్టోర్‌లలోని నెలవారీ విక్రయాలు రూ. 22 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ అమ్మకాల ఫలితాలతో యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ సంతోషం వ్యక్తం చేశారని, అందుకే 2027 నాటికల్లా ఆసియా - పసిపిక్‌ రీజియన్లలో 15 స్టోర్లు, యూరప్‌ - మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో ఐదు స్టోర్లు, అమెరికా - కెనడాలలో నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక హైలెట్‌ చేసింది. 

దీంతో పాటు ఇప్పటికే కార్యకాలపాలు కొనసాగుతున్న ఆసియా దేశాల్లో ఆరు స్టోర్లు, యూరప్‌లో తొమ్మిది స్టోర్లు, నార్త్‌ అమెరికాలో ఉన్న 13 స్టోర్లను మరో ప్రాంతానికి మార్చేలా టిమ్‌ కుక్‌ సంబంధిత విభాగాల అధిపతులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. 

ముఖ్యంగా..అమెరికా, యూరప్‌ తర్వాత ఆసియా ప్రాంతంలో యాపిల్ రిటైల్ మార్కెట్‌ను విస్తరించాలనే లక్ష్యంతో 2027 నాటికల్లా యాపిల్‌ స్టోర్ల పునరుద్దరణ, విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా 2025 నాటికి ముంబైలోని సబర్బన్‌లోని బోరివాలి ప్రాంతంలో మూడో యాపిల్‌ స్టోర్‌ను, 2026 నాటికి ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్‌ ప్రోమెనేడ్‌ మాల్‌లో ఐదో స్టోర్‌ను, 2027 నాటికి ముంబైలోని వ్రోలి ప్రాంతంలో ఇలా మరో మూడు స్టోర్‌లను యాపిల్‌ ప్రారంభించనుంది.

 చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top