
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ యాప్ ట్రాకింగ్ ప్రైవసీ ఫీచర్ కంపెనీ ప్రకటించిన లక్ష్యానికి అనుగుణంగా లేదని ఫ్రెంచ్ యాంటీట్రస్ట్ అధికారులు 150 మిలియన్ యూరోలు (సుమారు రూ.1,350 కోట్లు) జరిమానా విధించారు. ఇతర యూరోపియన్ దేశాలు కూడా ఈమేరకు జరిమానా విధించాలనే పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.
యాపిల్ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ(ఏటీటీ) సాఫ్ట్వేర్ను అమలు చేసిన విధానం.. వినియోగదారు డేటాను రక్షించేలా కంపెనీ ప్రకటించిన లక్ష్యానికి అనుగుణంగా లేదని ఫ్రెంచ్ యాంటీట్రస్ట్ అధికారులు తెలిపారు. దాంతో థర్డ్ పార్టీ పబ్లిషర్గా ఉన్న యాపిల్పై జరిమానా విధించారు. దీంతోపాటు యాపిల్ తన నిర్ణయాన్ని ఏడు రోజుల్లో తన వెబ్సైట్లో ప్రచురించాల్సి ఉంటుంది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, పోలాండ్ అధికారులు కూడా వినియోగదారుల గోప్యతకు సంబంధించి యాపిల్ ప్రమోట్ చేసే ఏటీటీపై దర్యాప్తు ప్రారంభించారు.
నిరాశకు గురయ్యాం: యాపిల్
ఫ్రెంచ్ అధికారులు తీసుకున్న నిర్ణయంతో తాము నిరాశకు గురయ్యామని, ఫ్రెంచ్ కాంపిటీషన్ అథారిటీ ఏటీటీలో ఎలాంటి నిర్దిష్ట మార్పులు సూచించాల్సిన అవసరం లేదని యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021లో యాపిల్ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ను ఇతర అప్లికేషన్లు, వెబ్సైట్లో కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇందుకోసం ముందుగా పాప్-అప్ విండో ద్వారా యూజర్లు అనుమతివ్వాల్సి ఉంటుంది. అది నిరాకరిస్తే యాప్ ఆ వినియోగదారునికి సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయదు. ఈ క్రమంలో యాజర్లకు టార్గెట్ యాడ్స్ వస్తున్నట్లు అధికారులు ఆరోపించారు. యాడ్ విభాగంలో పోటీదారులను పరిమితం చేస్తూ యాపిల్ తన సొంత ప్రకటనల సేవలను ప్రోత్సహించడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తోందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: తెల్లవారితే మారే రూల్స్ ఇవే!
ప్రైవసీపై మరింత నియంత్రణ
ఏటీటీ ఫీచర్ ఐఫోన్లు, ఐప్యాడ్లలో థర్డ్ పార్టీ యాప్స్ కోసం అధిక సంఖ్యలో పర్మిషన్ విండోలు వచ్చేలా చేస్తుందని ఫ్రాన్స్ కాంపిటీషన్ అథారిటీ తన నిర్ణయంలో పేర్కొంది. ఈ ఫీచర్ యాడ్ పబ్లిషర్లు, యాడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని తెలిపింది. యాపిల్ అనుసరిస్తున్న విధానం చిన్న ప్రచురణకర్తలను ప్రభావితం చేస్తుందని, వారు తమ వ్యాపారాలకు నిధులు సమకూర్చడానికి థర్డ్ పార్టీ డేటా సేకరణపై ఎక్కువగా ఆధారపడేలా ఉందని అథారిటీ పేర్కొంది.