
ఏఐఎఫ్ ఏయూఎం రూ.5.38 లక్షల కోట్లు
2024–25 క్యూ4లో 32 శాతం పెరుగుదల
ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలకు (ఏఐఎఫ్/ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్) ఆదరణ పెరుగుతోంది. వీటి నిర్వహణలోని ఆస్తులు 2025 మార్చి త్రైమాసికం చివరికి రూ.5.38 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం చివరికి ఉన్న రూ.4.07లక్షల కోట్లతో పోల్చి చూస్తే 32 శాతం పెరిగినట్టు సెబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అధిక ధనవంతులు, ఫ్యామిలీ ఆఫీస్ల అస్సెట్ అలోకేషన్లో (పెట్టుబడుల కేటాయింపులు) స్పష్టమైన మార్పును ఈ గణంకాలు సూచిస్తున్నాయి.
ఈక్విటీ మార్కెట్లో అస్థిరతలు పెరిగిపోవడం, అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టబుడులను మరింత వైవిధ్యం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడమే ఏఐఎఫ్ ఆస్తుల వృద్ధికి దోహదపడినట్టు పెట్టుబడి సలహా సేవల సంస్థ ‘మల్టీ యాక్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్’ వెల్లడించింది. సంప్రదాయ ఈక్విటీ, డెట్ పెట్టుబడులకే పరిమితం కావడం నుంచి ఇతర సాధనాల వైపు ఇన్వెస్టర్లు మళ్లుతున్నారనడానికి నిదర్శనంగా పేర్కొంది.
ముఖ్యంగా హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐలు/ధనవంతులు), అల్ట్రా హెచ్ఎన్ఐలు ఏఐఎఫ్ విభాగం వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలిపింది. ఏఐఎఫ్ ఫండ్స్ కిందకు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, ప్రైవేటు క్రెడిట్, ఇతర సంప్రదాయేతర పెట్టుబడి సాధనాలు వస్తాయి. మార్కెట్లు అస్థిరతలకు గురైన సందర్భాల్లో ఏఐఎఫ్ పెట్టుబడులు స్థిరత్వంతోపాటు, అధిక రాబడులు అందించడం వీటి పట్ల ఆసక్తి పెరగడానికి కారణంగా మల్టీ యాక్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నివేదిక తెలిపింది.
ఇదీ చదవండి: ఇండియాలో స్టార్లింక్ సేవలకు డేట్ఫిక్స్?
వైవిధ్యం–హెడ్జింగ్
‘ఫ్యామిలీ ఆఫీసులు పెట్టుబడులను దీర్ఘకాల దృష్టిలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక ఇతర ఇన్వెస్టర్లతో పోలిస్తే ప్రైవేటు పెట్టుబడుల్లో వీరి భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది’ అని ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా వైవిధ్యంతోపాటు ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు హెడ్జింగ్ వంటివి ఏఐఎఫ్ పెట్టుబడుల వృద్ధికి కారణాలుగా పేర్కొంది. సాధారణంగా ఏఐఎఫ్లను కేటగిరీ –1, 2, 3లుగా విభజిస్తుంటారు. ఆరంభ స్థాయి వెంచర్ క్యాపిటల్, ప్రైవేటు ఈక్విటీ, ప్రైవేటు క్రెడిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్–షార్ట్ హెడ్జ్ వ్యూహాలతో ఏఐఎఫ్లు పనిచేస్తుంటాయి. ఈ భిన్నమైన అవకాశాల ద్వారా ఈక్విటీ, డెట్ మార్కెట్లలోని అస్థిరతలను హెచ్ఎన్ఐలు అధిగమించగలుగుతారని, రిస్క్ను మెరుగ్గా నిర్వహించగలరని ఈ నివేదిక వివరించింది. భిన్న మార్కెట్ సైకిల్స్ను సమర్థవంతంగా అధిగమించే విధంగా వారి పోర్ట్ఫోలియో నిర్మాణం ఉంటుందని తెలిపింది. భారత్లో 10 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగిన వారు 85,698 మంది ఉన్నట్టు నైట్ఫ్రాంక్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025 ఇటీవలే వెల్లడించింది.