న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు, ట్రేడర్ల కోసం బ్రోకరేజ్ సంస్థ ‘5పైసా క్యాపిటల్’ శనివారం కొత్త ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. ‘అల్గోస్పేస్’ పేరుతో ప్రారంభించిన ఈ అల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా.. సాధారణ ఇన్వెస్టర్లు కూడా సులువుగా అల్గో–ఆధారిత ఇన్వెస్ట్మెంట్లు, ట్రేడింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
సాధారణంగా ఆటోమేటెడ్ వ్యూహాలను రూపొందించడం, వాటిని అమలు చేయడం కష్టంగా ఉంటుంది. ఇప్పటివరకు అల్గోరిథమిక్ ట్రేడింగ్ రంగంలో కేవలం పెద్ద పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లు, సాంకేతికంగా లోతైన అవగాహన ఉన్నవారే ఎక్కువగా రాణిస్తున్నారు. అయితే, ఈ సాంకేతిక అడ్డంకులను తొలగిస్తూ కోడింగ్ నైపుణ్యాలు, సంక్లిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండానే నేరుగా వాడుకునేందుకు సిద్ధంగా ఉన్న ట్రేడింగ్ వ్యూహాలను ఈ ‘అల్గోస్పేస్’ ద్వారా మార్కెట్లోకి తెచ్చినట్లు ‘5పైసా’ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ ఛార్జీలు మినహా, ఈ ‘అల్గోస్పేస్’ను వాడుకునేందుకు ఇన్వెస్టర్ల నుండి ఎలాంటి అదనపు ప్లాట్ఫామ్ ఫీజులు, కమీషన్లు వసూలు చేయమని స్పష్టం చేసింది.


