భద్రాచలంటౌన్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద చేరుతుండగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం రాత్రి 20 అడుగులు ఉన్న నీటిమట్టం, మంగళవారం ఉదయం నుంచి పెరుగుతూ రాత్రి 9గంటలకు 30 అడుగులుగా నమోదైంది. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే గోదావరి నీటిమట్టం బుధవారం 40 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యాన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించారు.
చర్ల: మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈక్రమాన మంగళవారం ప్రాజెక్టు 25 గేట్లలో 12గేట్లను ఎత్తి 23,308 క్యూసెక్కుల మేర వరదనీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74మీటర్లు కాగా, వరద దృష్ట్యా 73.41 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు.


