జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల: ీపజీఆర్ఎస్లో అర్జీలు అందజేసిన వారితో అధికారులు మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి, ఇన్చార్జి డీఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జాయింట్ కలెక్టర్ భావన వశిష్టలతో కలసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి మొత్తం 145 అర్జీలు వచ్చాయన్నారు. అర్జీదారులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలు పునరావృతం గాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వారంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్ఓ) జగన్మోహన్ను ఈ సందర్భంగా కలెక్టర్, జేసీ, డీఆర్ఓలు సత్కరించి, శాలువలు కప్పి, జ్ఞాపికను అందజేసి అభినందించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓఎల్ ప్రభాకర్ రావు, సీపీఓ ఏ.ఎస్.రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


