
కదంతొక్కిన వైఎస్సార్సీపీ
కూటమి ప్రభుత్వ తీరుపై జిల్లావ్యాప్త నిరసనలు
ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల ఆగ్రహం
భారీ ఎత్తున బైక్ ర్యాలీలు
స్వచ్ఛంద మద్దతు తెలిపిన మహిళలు
సూపర్సిక్స్ హామీలు అమలు చేసే వరకు వదిలేది లేదని ప్రతిన
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజా వ్యతిరేకత మిన్నంటింది. సూపర్ సిక్స్ పేరిట అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తీరుపై నిరసన హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పట్టింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్పంచుకోగా.. ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి మద్దతు పలికారు. ఎక్కడికక్కడ మోటార్ సైకిళ్లతో ర్యాలీలు నిర్వహిస్తూ.. సీఎం డౌన్డౌన్ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయా నియోజకవర్గాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కర్నూలులో ఎండీయూ వాహన ఆపరేటర్లు తమ వాహనాలతో నిరసన ర్యాలీలో మద్దతు తెలిపారు.
ఏడాదంతా రెడ్ బుక్ పాలనే..
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన దినం చేపట్టారు. కర్నూలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ధర్నా చౌక్ నుంచి బుధవారపేట, కర్నూలు ప్రభుత్వాసుపత్రి, ఎనీ్టఆర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్కు ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన అట్టర్ఫ్లాప్ అయ్యిందన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కూటమి నేతలు ఆచారణ సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో మరింత వ్యతిరేకత ఉందని, కూటమి నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. ఎక్కడికక్కడ తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్సీపీ నేతలు కలెక్టరేట్లో డీఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు
మంత్రాలయం: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం చేరుకొని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, ప్రదీప్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు: ఎమ్మెల్యే బి.విరూపాక్షి వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
పాణ్యం: కల్లూరులో నంద్యాల పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్యతో కలిసి వెన్నుపోటు నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున చేపట్టారు. కల్లూరులోని తన స్వగృహం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆదోని: పట్టణంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ను వినతిపత్రం అందజేశారు.
పత్తికొండ: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
కోడుమూరు: నియోజకవర్గంలోని గూడురులో పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీ‹Ùఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్దన్ పాల్గొన్నారు. పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఎమ్మిగనూరు: పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుకా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్నోహాన్ రెడ్డి పాల్గొన్నారు.
పోరాటాన్ని కొనసాగిస్తాం
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలను మోసం చేశాడు. రూ.1.60 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రూ.1000లు కూడా సంక్షేమ పథకాల కింద ఇవ్వలేకపోయాడు. మరి అంత డబ్బు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏడాది గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు నిరసన దినం చేపట్టింది. నిరసనలను ఇంతటితో ఆపం.. ప్రజలతో కలిసి ఇక మీదట కూడా చంద్రబాబు మెడలు వంచేందుకు పోరాటాన్ని కొనసాగిస్తాం.
– ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు
చంద్రబాబు నైజం ప్రజలకు తెలిసిపోయింది
ఏడాది గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. తాము మోసపోయామనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కూటమి నాయకులు ప్రజల వద్దకు వెళితే తిరగబడటం ఒక్కటే మిగిలింది. పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది.
– మధుసూదన్, ఎమ్మెల్సీ
సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసినట్లుంది
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్లు చూసి చూపించారు. ఈ ప్రభుత్వం అంతకంటే గొప్పగా చేస్తామని చెప్పడంతో ఓట్లేశాం. ఇప్పుడు చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రజలకు అందింది లేదు. సంవత్సరమైనా ఎదురుచూడటంతోనే సరిపోతుంది. సూపర్సిక్స్ పథకాలని చెప్పి ప్రజలందరినీ మోసం చేసినారు. ఈ నాయకులకు మళ్లీ మా దగ్గరికి రావాలంటే మొహం ఎలా వస్తుంది. బుద్ధి ఉంటే ఇంకోసారి నమ్ముతామా?.
– దస్తగిరి, హాలహర్వి గ్రామం, నందవరం మండలం