సాక్షి, విజయవాడ: దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉచితసేవలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్జిత సేవలు గురించి దేవస్థానం జారీ చేసే అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని దేవాదాయ శాఖ అధికారులు ఈ రోజు (శనివారం) ప్రకటన విడుదల చేశారు. స్వామివారి దర్శనములు, సేవలు, ఉత్సవాలు, ఊరేగింపులు గురించి సోషల్ మీడియా గానీ ఇతరప్రసార మాధ్యమాలలో లేదా వ్యక్తుల వ్యక్తిగత ప్రకటనలు /ప్రచారాలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని పేర్కొన్నారు.
అమ్మవారి దర్శనం చేయిస్తామని, సారె సమర్పించడానికి ఏర్పాటు చేస్తామని, అమ్మవారి దగ్గర సేవ చేయడానికి అవకాశం ఇప్పిస్తామని, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎవరైనా చెబితే వాటిని అస్సలు ఆ మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. దేవస్థానంలో సేవలు పొందడానికి, ఏదైనా విరాళాలు చెల్లింపు, భక్తులు ఉచిత సేవలు అందించడానికి మధ్యవర్తుల ప్రమేయం లేదని ఆలయ ఈవో స్పష్టం చేశారు.
ఆలయ సేవలకు సంబంధించి ఏదైనా వివరాలకు భక్తులు దేవస్థానం కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలని తెలిపారు. దేవస్థానం వెబ్ సైట్ : www.kanakadurgamma.org, దేవస్థానం టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ :18004259099పై సంప్రదించాలని దేవస్థానం ఈవో వికె శీనా నాయక్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.


