ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్‌?: వైఎస్‌ జగన్‌ | YS Jagan On guntur Woman case | Sakshi
Sakshi News home page

ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్‌?: వైఎస్‌ జగన్‌

Jul 18 2026 6:08 PM | Updated on Jul 18 2026 8:50 PM

 YS Jagan On guntur Woman case

తాడేపల్లి: గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదని, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.

‘‘బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.

ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా?

ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్‌?’’ అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో దారుణాలు
రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించిందని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.

అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. 

ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్‌? చంద్రబాబూ.. మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది’’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement