తాడేపల్లి: ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది బృందం గేలాలతో చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లగా, వరదనీరు ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు ప్రవాహంలో కొట్టుకుపోయి, ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


