సాక్షి, గుంటూరు: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగ సక్సెస్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సంస్థ యాజమాన్యానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
విక్రమ్-1 ప్రయోగం విజయవంతం కావడం భారత అంతరిక్ష పరిశోధన రంగంలో చారిత్రాత్మక విజయమని జగన్ పేర్కొన్నారు. ఈ విజయం దేశంలో ప్రైవేట్ అంతరిక్ష సంస్థల సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థ అభివృద్ధిలో స్కైరూట్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన రాకెట్ విజయవంతం కావడం యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో స్కైరూట్ మరిన్ని విజయాలు సాధించాలని, భారత అంతరిక్ష రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని జగన్ ఆకాంక్షించారు. దేశ సాంకేతిక ప్రగతిలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Congratulations to Skyroot Aerospace on the successful launch of #Vikram1, a landmark achievement as India’s first privately developed orbital launch vehicle. This milestone reflects the extraordinary capabilities of our scientists, engineers, innovators, and entrepreneurs. This…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2026
విక్రమ్-1 సక్సెస్
ఇవాళ (జూలై 18, 2026) ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC-SHAR) నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ తన తొలి కక్ష్య (ఆర్బిటల్) రాకెట్ విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించింది. 'మిషన్ ఆగమన్' పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం కొత్త చరిత్ర సృష్టించింది. విక్రమ్-1 అనేది హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఉపగ్రహ ప్రయోగ వాహకం (లాంచ్ వెహికల్).
తక్కువ బరువున్న ఉపగ్రహాలను భూమికి దిగువ కక్ష్య (Low Earth Orbit)లోకి పంపేలా దీనిని రూపొందించారు. 22 మీటర్ల ఎత్తు కలిగిన ఈ రాకెట్ గరిష్టంగా 350 కిలోల పేలోడ్ను లో ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్లగలదు. పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణం, 3డీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్, స్వదేశీ సాంకేతికత దీని ప్రత్యేకతలు. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీల పాత్ర మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్లో భారత్కు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


