సాక్షి, పోలవరం జిల్లా: ఎటపాక మండలం గొల్లగూడెంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మృతదేహాలను రెస్క్యూ బృందం వెలికితీసింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా గొమ్ము కొత్తగూడెం వాసులుగా గుర్తించారు. మృతులను సుశీల, లక్ష్మి, భారతీ, బాలరాజు, రమేష్గా గుర్తించారు. గోదావరిలో గేలాలతో చేపలు పట్టేందుకు 8 మంది బృందం వెళ్లారు. గోదావరి వరద నీరు ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు వరద నీటిలో కొట్టుకుపోయారు.
వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి:
ఎటపాక మండలం గొల్లగూడెం దగ్గర గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి.. తగిన ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


