సాక్షి, తాడేపల్లి: గుంటూరు ఘటన అత్యంత అమానవీయం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో అమానుషంగా మహిళను వివస్త్రను చేసి.. టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నూరి ఫాతిమా పరామర్శించారు. బాధిత మహిళకు ధైర్యం చెప్పారు.
అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడు రోజుల క్రితం సంఘటన జరిగితే నిన్న జరిగినట్టు చంద్రబాబు చెప్తున్నారు. ఈ మూడు రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు అబద్దాలు చెప్పటం దుర్మార్గం. టీడీపీ నేత మల్లెల మూర్తి బాధిత మహిళ, ఆమె కుమారుడిని దారుణంగా కొట్టారు. అదే రోజు పోలీసు స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు’’ అని ఆయన మండిపడ్డారు.
‘‘నా మీదే స్టేషన్కు వెళ్తావా? అంటూ రోడ్డు మీదే కొట్టారు. ఆ మహిళను వివస్త్ర చేశారు. కేసు పెట్టకపోగా కేసు రిజిస్టర్ చేయలేదు. ఆ తర్వాత 16న నమోదు చేసి అరెస్టు కూడా చేయలేదు. సీసీ కెమెరా పుటేజీ బయటకు వచ్చాక చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే మేల్కొన్నారు. ఆ టీడీపీ నేత మూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మేము పరామర్శకు వెళ్తున్నామని తెలిసి బాధిత కుటుంబాన్ని విచారణ పేరుతో పీఎస్కు తరలించారు.
..టీడీపీ నేత డబ్బులు వసూలు చేసే దందాలో జరిగిన గొడవ ఇది. దీన్ని వెలుగులోకి రాకుండా తొక్కేసేందుకు ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కుట్ర జరిగింది. కానీ పోలీసులను బలి చేసే కుట్ర చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూసి హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. తన పదవికి రాజీనామా చేసి వెళ్లాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.


