గోదారిలో మునిగి ఐదుగురి.. కుందూ నదిలో ఇద్దరు మృత్యువాత
పోలవరం జిల్లాలో చేపల వేటకు వెళ్లి గిరిజనులు..
నంద్యాల జిల్లాలో పశువులు మేపుకునేందుకు వెళ్లి మహిళలు మృతి
ఎటపాక/ఉయ్యాలవాడ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. పోలవరం జిల్లా ఎటపాక మండలంలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి చనిపోగా.. నంద్యాల జిల్లాలో జీవాలు మేపుకునేందుకు వెళ్లి కుందూ నదిలో పడి ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. వివరాలివీ.. పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన 11 మంది గిరిజనులు శనివారం ఉదయం గొల్లగూడెం సమీపాన గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లారు. ఊకే రమేష్ (37) నదిలో పడిపోయాడు.
ఈత రాకపోవటంతో నీటిలో మునిగిపోతుండడంతో బాసిబోయిన బాలరాజు (40) అతడిని కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బాలరాజును రమేష్ గట్టిగా పట్టుకోవటంతో ఇద్దరూ మునిగిపోసాగారు. వారితో పాటే వల పట్టుకుని ఉన్న ఊకే లక్ష్మి (37), ఊకే సుశీల (37), తుర్రం భారతి (40) తమ వద్దనున్న చున్నీలు, వలలు విసిరి వారిద్దరినీ కాపాడే ప్రయత్నం చేయగా వీరు కూడా మునిగిపోసాగారు.
అది గమనించిన మరికొందరు మహిళలు ఆ ఐదుగురినీ కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ఐదుగురూ గల్లంతవగా.. ఒడ్డునున్న మహిళలు కేకలు వేయడంతో సమీపంలోని జాలర్లు గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.కొద్దిసేపటికి ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎటపాక పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెలంగాణలోని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతులందరూ వ్యవసాయ కూలీలు. వీరిలో నలుగురుకి వివాహం కాగా రమేష్ అవివాహితుడు. వారి ఆకస్మిక మృతితో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలముకుంది.
పశువులు మేపుకునేందుకు వెళ్లి..
నంద్యాల జిల్లా బోడెమ్మనూరు గ్రామంలో చోటుచేసుకున్న మరో ఘటనలో.. జీవాలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృత్యువాత పడ్డారు. రోజులానే శనివారం ఉదయం పశువులు మేపుకునేందుకు రసూల్బీ (38), బీబీ అలియాస్ దేవి (50)తో పాటు మౌనిక కుందూ నది ఆవల ఇంజేడు గ్రామ పొలాల్లో మేపుకునేందుకు బయల్దేరారు.
అయితే, నదిలోని నీటి గుంతలోకి మేకలు వెళ్లడంతో రసూల్బీ వాటికోసం ఆ గుంతలోకి దిగింది. ఈమె మునిగిపోతుండడాన్ని గమనించిన బీబీ (దేవి) ఆమెను కాపాడేందుకు నీటిలోకి దిగింది. ఇద్దరూ ఊపిరాడక నదిలో గల్లంతయ్యారు. ఒడ్డునున్న మౌనిక జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారు నదిలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. మృతులిద్దరూ వరుసకు అత్తాకోడళ్లు.
వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి..
ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన బృందం చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లగా వీరిలో ఐదుగురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


