ఆలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 25న ఆస్పరి పీహెచ్సీలో సంజీవిని పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన భాగంగా ఆస్పరి పోలీసు సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పచ్చని చెట్లను శనివారం నరికేశారు. వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే పచ్చని చెట్లును తొలగించడం ఏమిటని వైఎస్సార్సీపీ నాయకులు, పర్యావరణ ప్రేమికులు ప్రశ్నించారు.
8 మండలాల్లో
తేలికపాటి వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 8 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. నెల రోజులకు పైగా వర్షాలు లేక దెబ్బతిన్న పంటలకు కొంతమేర ఊపిరిపోశాయి. పెద్దకడుబూరులో 20.6 మి.మీ, ఆదోనిలో 11.2, ఎమ్మిగనూరులో 7.2, ఆదోనిలో 5.6, గోనెగండ్లలో 4.8, కౌతాళంలో 4.0, ఓర్వకల్లులో 2.0, నందవరంలో 1.4, గూడూరులో 1.0 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. జులై నెల సాధారణ వర్షపాతం 90.5 మి.మీ ఉండగా 18 రోజుల్లో 6.9 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. కాగా సాయంత్రం 7 గంటల నుంచి కర్నూలు, కల్లూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
ఎండిన పంటల పరిశీలన
గూడూరు: ఖరీఫ్లో సాగు చేసి ఎండిపోయిన పంటలను జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సత్యనారాయణ, రామచంద్రరావు శనివారం పరిశీలించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కె.నాగలాపురం, గుడిపాడు గ్రామ రైతులకు వివరించారు. మండల వ్యవసాయాధికారి దస్తగిరిరెడ్డి, నంద్యాల డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు జయలక్ష్మి, శారద, సుజాతమ్మ, రాఘవేంద్ర చౌదరి, అశోక్కుమార్, మల్లేశ్వరరెడ్డి, మోహన్ విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు.


