● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్ తీసుకోను అనే పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యా సంస్థల వద్ద మత్తు పదార్థాల విక్రయాలపై గట్టి నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల ద్వారా మత్తు పదార్థాల రవాణా జగరకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆర్ఎంను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. గోనెగండ్లలో ఇంటర్ విద్యార్థులు గంజాయిని సేవించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని పాఠశాలలు, కళాశాలల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో 1972 నంబర్కు గంజాయి సమాచారం ఇవ్వాలనే సూచన ఉండాలన్నారు. ఈగల్ ఐజీ రవికృష్ణ ఆదేశాల మేరకు పల్లెబాటలో ఈగల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాదు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఈఓ సుధాకర్, అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ సుధీర్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, డీసీహెచ్ఎస్ జఫ్రూల్లా పాల్గొన్నారు.


