ఆదోని అర్బన్: అనుమానాస్పద స్థితిలో ప్రేమికుడు ఉరేసుకుని మృతిచెందాడు. ఆదోని వన్టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. ప్రవీణ్(20), సిద్ధి ధీరజ్పాండే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి ఈ ఏడాది మార్చిలో ఆదోని పట్టణానికి వచ్చారు. స్థానిక భీరప్పనగర్లో బాడుగకు ఇల్లు తీసుకుని ఉన్నారు. ప్రేమికుడిని కుటుంబ సభ్యులు నెలకోసారి వచ్చి వారు జీవించడానికి కొంత డబ్బు సాయం చేసేవారు. అయితే ప్రేమికురాలు మైనర్ కావడంతో ఒక సంవత్సరం పూర్తయితే మేజర్ అవుతుందని, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. సోమవారం సాయంత్రం ప్రవీణ్ ఉరేసుకుని కిందకు పడిపోయి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని, సిద్ధి మాత్రం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సీఐ తెలిపారు. మృతిచెందిన ప్రేమికుడిని చూసి వెంటనే ప్రేమికురాలు పక్కింటివారిని పిలవడంతో స్థానికులు వచ్చి హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రవీణ్ ఉరేసుకున్న ఆనవాళ్లు కనిపించడం లేదని, వైద్యులు మాత్రం ఉరేసుకున్నట్లు నిర్ధారించారని సీఐ తెలిపారు. విషయాన్ని మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామన్నారు.


