జర్నలిస్టుల స్థలాల్లో మట్టిదొంగలు
● కబ్జాకు లోనవుతున్న పలు పాట్లు
● కరువైన మౌలిక సదుపాయాలు
● సరైన దారిలేక
అభివృద్ధికి దూరం
మట్టి తరలింపుతో జర్నలిస్టుల స్థలాల్లో ఏర్పడిన గోతులు
బండరాళ్లు బయటపడేంత వరకు మట్టి తోడేసిన దృశ్యం
జర్నలిస్టుల ప్లాట్లు ఆక్రమించి రియల్ ఎస్టేట్ యాజమాన్యం పాతిన పోల్స్
ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తున్న జర్నలిస్టుల స్థలాలకు భద్రత కరువైంది. ప్రశ్నించే కలాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ఓదార్చే దిక్కు కరువైంది. కష్టాన్నంతా పోగు చేసి ప్రభుత్వ స్థలానికి డబ్బు చెల్లించి కొనుగోలు చేసినా కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం మట్టి దొంగలకు, భూ కబ్జాదారులకు వరంగా మారింది. గత ప్రభుత్వంలో తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం రూపురేఖలు మారుస్తామన్న టీడీపీ నేతలు ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. మీకు అండగా మేమున్నామంటూ ఎన్నికలకు ముందు ఆ ప్రాంతంలో హడావుడి చేసిన ఎర్ర చొక్కాలు ఇప్పుడు మౌనం దాల్చాయి. కర్నూలు నగరంలోని జర్నలిస్టులకు వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగన్నాథ గట్టుపై కర్నూలు జిల్లా జర్నలిస్టు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట సర్వే నెం. 478లో 15.44 ఎకరాల భూమిని రూ.61.77 లక్షలకు కేటాయించారు. 218 మంది జర్నలిస్టులకు 2009లో ప్లాట్లు కేటాయించారు. అయితే నేటివరకు ఆ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో సరైన దారి లేక జర్నలిస్టులు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. రోడ్డు వేయించండి.. నీటి సౌకర్యం కల్పించండి.. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయండి అని రాజకీయ నాయకులు, అధికారుల కాళ్లావేళ్లా పడినా ఏ ఒక్కరూ కనికరించని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కులు ఆ స్థలంలోని నెంబర్ రాళ్లను తొలగించి మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడి ప్లాట్లలో పెద్ద పెద్ద గోతులే దర్శనమిస్తున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ యజమాని ఏకంగా కొన్ని ప్లాట్లను ఆక్రమించి దిమ్మెలు పాతడం విస్మయాన్ని కలిగిస్తోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


