నేడు, రేపు జరిగే ఇండోర్ సమావేశాల్లో డీఎస్సీ అక్రమాలపై చర్చించాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్చార్జి ఆలూరు సాంబశివారెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, బాధిత నిరుద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్చార్జి ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలపై యూత్, స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జోనల్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ, మండల అధ్యక్షులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
సాంబశివారెడ్డి మాట్లాడుతూ వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాల్లో భాగంగా సోమ, మంగళవారాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే టౌన్హాల్ ఇండోర్ సమావేశాల్లో డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలు ప్రధాన చర్చాంశంగా ఉండాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.


