పొగాకు రైతులు ఎందుకు నష్టపోతున్నారు?: వైఎస్‌ జగన్‌ ఆరా | YS Jagan Visit Prakasam Podili Meet Tobacco Farmers Speech Live Updates | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులు ఎందుకు నష్టపోతున్నారు?: వైఎస్‌ జగన్‌ ఆరా

Jun 11 2025 10:32 AM | Updated on Jun 11 2025 1:18 PM

YS Jagan Visit Prakasam Podili Meet Tobacco Farmers Speech Live Updates

సాక్షి, ప్రకాశం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. పోగాకు బేళ్లను పరిశీలించిన ఆయన.. ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తోంది? అని ఆరా తీశారు. మరోవైపు గిట్టుబాటు ధర లేక అల్లలాడిపోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌ రాక నేపథ్యంలో పొదిలి మొత్తం జన సంద్రంగా మారింది.

అంతకు ముందు.. జగన్‌కు పొదిలిలో అపూర్వ స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు.. చూసేందుకు భారీగా రైతులు, జనం తరలి వచ్చారు. జై జగన్‌.. జైజై జగన్‌ నినాదాలతో హెరెత్తిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరగా.. ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు.  

కొందరు రైతులు ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. ‘‘మా పరిస్థితి ఏం బాగా లేదు. మిర్చి రైతుల దగ్గరి నుంచి అంతా నష్టాల్లోనే ఉన్నాం. టిఫిన్‌ తినడానికి కూడా డబ్బుల్లేవు. జగన్‌ పాలనలోనే మా పరిస్థితి బాగుంది. కూటమి పాలనలో మా పరిస్థితి అధ్వాన్నం. జగన్‌ హయాంలో కేంద్రంతో మాట్లాడి మాకు న్యాయం చేశారు.. 

.. ఇప్పుడు రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర లేక ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.  మా పరిస్థితి బాలేదని చెప్పుకున్నా అరెస్ట్‌ చేస్తున్నారు. వైఎస్సార్‌, జగన్‌ పాలనలో రైతులకు మంచి జరిగింది. కూటమి పాలనలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఒక్కో పొగాకు బేళ్లకు రూ.3 వేలు నష్టం. కనీసం ఇవాళ్టి జగన్‌ పర్యటనతోనైనా గిట్టుబాటు ధర ఇచ్చే అవకాశం ఉంది. 2029లో కూటమి ప్రభుత్వాన్ని పడగొడతాం’’ అని కొందరు పొగాకు రైతులు సాక్షితో అన్నారు. 

జగన్‌ వస్తున్నాడయ్యా.. త్వరగా కానివ్వండి!

ఏడాది కాలంగా పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే జగన్‌ రాక నేపథ్యంలో పొగాకు ఆక్షన్‌ పూర్తి చేయాలని ఆగమేఘాల మీద అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆక్షన్‌ త్వరగతిన పూర్తి చేయాలని బోర్డుపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఉదయం నుంచి రైతులు లేకుండానే అధికారులు ఆక్షన్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఏకంగా తొంబై శాతం బేళ్లు కొనుగోలు జరిగినట్లు సమాచారం. మాములు రోజుల్లో ఇలా అసలు ఉండదు. రైతుల సమక్షంలోనే బోర్డు ఆక్షన్‌ నిర్వహిస్తోంది.  పైగా వచ్చిన బేళ్లలో 40 శాతం మాత్రమే కొనుగోలు జరుగుతోంది. అయితే.. 

ఇవాళ అందుకు భిన్నంగా అన్నీజరిగిపోతున్నాయి. పొగాకు రైతులను ఈ ఏడాది కాలంగా ఏమాత్రం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం. ఇంతకాలం గిట్టుబాటు ధర లేక వాళ్లు అల్లలాడిపోయారు. ఈ తరుణంలో జగన్‌ రాక సందర్భంగా హడావిడిగా ఆక్షన్‌ నిర్వహిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement