గట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంబోత్సవం సందర్భంగా పూజలో పాల్గొన్న వైఎస్ జగన్
భూమయ్యగారిపల్లెలో వైఎస్ జగన్పై వెల్లువెత్తిన అభిమానం
గట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంబోత్సవంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
గ్రామస్తుల ఇష్టదైవ సన్నిధిలో ప్రత్యేక పూజలు
గజమాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
వృద్ధుల ఆప్యాయత, చిన్నారులకు నామకరణం.. అక్షరాభ్యాసం
తిరుగు ప్రయాణంలో కాన్వాయ్ ఆపి అంబులెన్స్కు దారి
రాబోయేది మన ప్రభుత్వమే అంటూ పార్టీ శ్రేణులకు భరోసా
భావోద్వేగాలు, ప్రజా ప్రేమకు నిదర్శనంగా నిలిచిన పర్యటన
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా భూమయ్యగారిపల్లెలో అభిమాన జనం పోటెత్తారు. తమ ఇష్ట దైవం గట్టు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రారంబోత్సవంలో అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నారనే విషయం తెలుసుకొని ప్రజలు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వైఎస్ జగన్కు అర్చకులు వేద మంత్రాల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన జలాభిషేకం, కలశ స్థాపన, సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరికీ నరసింహ స్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులను, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. అంతకు ముందు వేముల జెడ్పీటీసీ సభ్యుడు బయపురెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు వైఎస్ జగన్కు భారీ గజ మాలతో ఘన స్వాగతం పలికారు.

గట్టు శ్రీలక్ష్మీనరసింహ స్వామికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేస్తున్న వైఎస్ జగన్
అనంతరం వైఎస్ జగన్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన పార్టీ నేత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీరామిరెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఇదే గ్రామంలోని జెడ్పీటీసీ సభ్యుడు బయపురెడ్డి ఇంటికి వెళ్లి.. కాసేపు గడిపి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

ప్రజలతో మమేకం
భూమయ్యగారి పల్లెలో 92 ఏళ్ల వృద్ధురాలు అన్నపూర్ణమ్మ వైఎస్ జగన్ వద్దకు వచ్చి బుగ్గలు తడిమి, తలపై చేతులు వేసి ఎంతో అప్యాయంగా ఆదరించింది. మరో వృద్ధురాలు తోటలో కోసుకొచ్చిన మల్లెపూలను వైఎస్ జగన్ చేతుల్లో పోసింది. అవే మల్లెపూలు తిరిగి ఆయన ఆమె వడిలో వేశారు. వైఎస్ జగన్ పట్ల వృద్ధులకు ఉన్న ప్రేమ, ఆప్యాయతలకు ఈ ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. అనంతరం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మనవరాలు.. పల్లవి, నరేష్ దంపతుల కుమార్తెకు ‘దైవిక’గా నామకరణం చేశారు.

అంబకపల్లెకు చెందిన భాస్కరరెడ్డి, భార్గవి దంపతుల కుమారుడు జగన్మోహన్రెడ్డి చేయి పట్టుకొని పలక (స్లేట్)పై అక్షరాలు రాయించారు. పెండ్లిమర్రి మండలం పాతసంగటిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగమల్లేశ్వరరెడ్డి అనారోగ్యం గురించి తెలుసుకున్న వైఎస్ జగన్.. ఆయన్ను ఫోన్లో పరామర్శించారు. భూమయ్యగారిపల్లె నుంచి పులివెందులకు తిరుగు ప్రయాణంలో తన కాన్వాయ్ వెనుక అంబులెన్సు వస్తుండటాన్ని గమనించి.. వెంటనే తన వాహన శ్రేణిని రోడ్డు పక్కన ఆపించి, అంబులెన్స్కు దారిచ్చారు.

పులివెందుల అభివృద్ధిలో మరో ముందడుగు
పులివెందుల పట్టణం 31వ వార్డులోని వైఎస్సార్ కాలనీలో నిర్మించిన సిమెంట్ రోడ్లను బుధవారం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యర్రగుడిపల్లె వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, చవ్వా దుష్యంత్రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
ధైర్యంగా ఉండండి
బుధవారం వైఎస్ జగన్ను వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు, చంద్రబాబు కూటమి ప్రభుత్వ బాధితులు, ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అందరికీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం రాబోయే మూడేళ్లు విశేషంగా కృషి చేయాలని సూచించారు. ఎవరూ అ«ధైర్య పడకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అని ధైర్యం చెప్పారు.

ఆయా కార్యక్రమాల్లో వైఎస్ జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, అనంతపురం జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ మేయర్ సురేష్బాబు, పులివెందుల పట్టణ ఇన్చార్జి చవ్వా దుష్యంత్రెడ్డి, కదిరి ఇన్చార్జి మక్బుల్బాషా, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, పార్టీ నేతలు రాజోలి వీరారెడ్డి, వేల్పుల రాము, సాంబశివారెడ్డి తదితరులు ఉన్నారు.


