పార్టీ శ్రేణులంతా ప్రజల తరఫున పోరాడాలని వైఎస్ జగన్ పిలుపు
నాటి వైఎస్సార్సీపీ పాలన.. ఇప్పటి చంద్రబాబు రెండేళ్ల పాలనను పోల్చి చూస్తూ ప్రతి ఇంట్లో చర్చ
జగన్ను దూరం చేసుకున్నామని భావిస్తున్న ప్రజలు
అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
అందుకే అందరిలోనూ తీవ్ర అసంతృప్తి.. బాబు మోసాలపై ప్రశ్నిస్తే దొంగ కేసులు.. దొంగ సాక్ష్యాలు.. వేధింపులు
వచ్చే రెండేళ్లు ఎంతో కీలకం.. మీరంతా ప్రజలతో మమేకమవ్వాలి
మీరు ప్రజల కోసం నిలబడండి.. వారి కోసం కష్టపడండి
మీ అందరి బాధ్యత నాది.. నేను స్వయంగా చూసుకుంటాను
అన్యాయ పాలన పోతుంది.. వెలుగు వస్తుంది
జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
గిరిజనులకు, ఆ ప్రాంతాల వారికి మేలు చేసింది మనమే
ఏజెన్సీలో విద్య, వైద్యానికి పెద్దపీట.. భూములపై హక్కుల కల్పన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని, దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను చంద్రబాబు బుట్టదాఖలు చేసి.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎత్తి చూపారు. చంద్రబాబు మోసాలను ఎవరైనా ప్రశ్నిస్తే దొంగ కేసులు.. దొంగ సాక్ష్యాలు.. వేధింపులు.. రెడ్బుక్ రాజ్యాంగంతో అణగదొక్కే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి.. మిగిలింది మూడేళ్లు మాత్రమే.. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది.. త్వరలోనే దుర్మార్గ పాలన పోతుందని స్పష్టం చేశారు.
‘వచ్చే రెండేళ్లు పార్టీకి ఎంతో కీలకమైన సమయం.. పార్టీలో ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలతో మమేకం కావాలి.. మీరు ప్రజల కోసం నిలబడండి.. వారి కోసం కష్టపడండి.. మీ అందరి బాధ్యత నాది. నేను స్వయంగా చూసుకుంటాను.. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది.. అన్ని కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే కొనసాగిస్తాం’ అని పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతోన్న వైఎస్ జగన్.. ఆ దిశలో భాగంగా గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు.
కార్యకర్తలు, నాయకులను ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు, ఏజెన్సీలో అభివృద్ధి ప్రాజెక్టులతో గిరిజనులకు మేలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..

మన పాలన, చంద్రబాబు పాలనపై ప్రతి ఇంట్లో చర్చ
» ‘ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నాకన్నా మీకే బాగా తెలుసు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్ల పాలన ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు జగన్ను చూశాం.. ఆయన ఐదేళ్ల పాలన చూశామని, ఆ పాలనకు, ఇప్పుడు చంద్రబాబు రెండేళ్ల పాలనకు మధ్య తేడా ఏమిటనేది ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారు. మన ఐదేళ్ల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని, ఎప్పుడూ జరగని విధంగా పాలన అందించామని గర్వంగా చెబుతున్నా.
» మనం రాక ముందు వరకు మేనిఫెస్టో అంటే ఏ మాత్రం విలువ ఉండేది కాదు. ప్రజలకు ఎన్నెన్నో చేస్తామని ఎన్నికల్లో మాట చెప్పి, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసేవారు. అదే మనం వచ్చాక, తొలిసారిగా మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి, 99 శాతం అమలు చేసిన పార్టీ ఒక్క మన వైఎస్సార్సీపీ మాత్రమే. బడ్జెట్ సమావేశాలకు ముందే పథకాలు, తేదీలు ప్రకటించి, క్రమం తప్పకుండా అమలు చేసింది కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా చేశాం.
» మనం రాకముందు స్కూళ్లు ఎలా ఉండేవి? మనం వచ్చిన తర్వాత ఎలా మారాయి?.. అనేది నాకన్నా మీరు బాగా చెప్పగలుగుతారు. మనం రాక ముందు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉండేది? మనం వచ్చాక ఆరోగ్యశ్రీని ఎంత బాగా అమలు చేశాం.. అనేది మీరే బాగా చెప్పగలరు. మనం రాక ముందు వ్యవసాయం ఎలా ఉండేది? రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు.. మనం వచ్చిన తర్వాత రైతన్న ఎలా బాగుపడ్డాడు.. వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది మీరే బాగా చెప్పగలరు. మనం రాక ముందు గ్రామాల్లో ఏ పథకం అందక, పరిపాలన అందక, దేనికైనా ఎవరెవరికో డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి. అదే మన వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, పాలన ఎలా మారింది? గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలు ఎలా అందాయి? అన్నీ చేసి చూపించాం.
» సచివాలయాల వ్యవస్థ.. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్. ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందాయి. ఇన్ని గొప్ప మార్పులు తీసుకురాగలిగాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చాం. దిశ యాప్తో మహిళలకు రక్షణ కల్పించాం. వారికి తోడుగా నిలబడ్డాం. ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ను సచివాలయంలో ఉంచాం.
గిరిజనులు.. గిరిజన ప్రాంతాల్లో మార్పులు
» ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూడా మన హయాంలోనే జరిగింది. ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేశాం. 3,22,528 ఎకరాలు, ఆర్ఓఎఫ్ఆర్ డీకేటీ భూముల భూ పట్టాలు పంపిణీ చేశాం. ఒక్క రంపచోడవరంలోనే 20 వేల మందికి 80 వేల ఎకరాల భూముల ఆర్ఓఎఫ్ఆర్ డీకే పట్టాలు పంపిణీ చేశాం.
» ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుడితే, వాటిలో ఒక్క మన ప్రాంతంలోనే పాడేరు, పార్వతీపురంతో పాటు, ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు తెచ్చాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. మన గిరిజనులు బాగు పడాలి.. వారు చదువుల్లో ముందుండాలన్న ఆరాటం కేవలం మన ప్రభుత్వంలోనే కనిపించింది.
» ఎప్పుడూ చూడని విధంగా ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో తలపెట్టి, వేగంగా పనులు చేశాం. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయని గర్వంగా చెప్పగలను. ఒక తపన, తాపత్రయంతోనే ఇవన్నీ చేశాం. మనుషుల జీవితాలు బాగు పడాలి. వారి బతుకులు మారాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్న తపనతో పని చేశాం.
ప్రశ్నిస్తే ఓర్చుకోలేకపోతున్నారు
చంద్రబాబుకు ఎందుకు ఓటేశాం? జగన్ను ఎందుకు పోగొట్టుకున్నామనే విషయంపై ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. త్వరలోనే దుర్మార్గ పాలన పోతుంది. అంతా అన్యాయమైన పాలన. చంద్రబాబు మోసాలపై ప్రశ్నిస్తే దొంగ కేసులు.. దొంగ సాక్ష్యాలు.. వేధింపులు. రెడ్బుక్ రాజ్యాంగం.. అందరినీ కోరేది ఒక్కటే. చీకటి ఎప్పటికైనా పోతుంది. వెలుగు రాక తప్పదు.
ఎన్నికల ముందు వారేం చెప్పారు?
ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఇంకా ప్రతి ఇంటికి చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో బాండ్లు పంపారు. ప్రతి ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారున్నారా? అయితే నీకు రూ.4 వేలు, నీకు రూ.4 వేలు. అలా ఏడాదికి రూ.48 వేలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలు కనబడితే ఏడాదికి నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని చెప్పారు.
18 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువకుడు కనిపిస్తే.. నీకు ఏడాదికి రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పారు. మీకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే మీకు రూ.26 వేలు ఇస్తామన్నారు. మనం ఇచ్చిన దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టో చూపి, ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారు.
మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి?
రెండేళ్లు గడిచాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నది చూస్తే.. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.18 వేల చొప్పున, రెండేళ్లలో రూ.36 వేలు బాకీ. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, రెండేళ్లలో ప్రతి పిల్లాడికి రూ.72 వేలు బాకీ. 50 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.4 వేల చొప్పున, రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మరోవైపు అమ్మ ఒడి తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు.
రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి ఇచ్చింది కూడా రూ.8 వేలు. రూ.9 వేలు మాత్రమే. కొందరికి రూ.13 వేలు ఇచ్చారు. రైతు భరోసా కింద పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానన్నాడు. అంటే రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది రూ.14 వేలు. ఇక్కడ బాకీ రూ.26 వేలు. గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు ఉచితం అన్నారు. రెండేళ్లలో రెండు మాత్రమే ఇచ్చారు. అది కూడా అందరికీ ఇవ్వలేదు.
పేదల పక్షాన నిలబడండి.. జగన్ 2.0లో మీకే అధిక ప్రాధాన్యం
ఇంకా మూడేళ్లు. చివరి ఏడాది ఎన్నికల ఏడాది కాబట్టి. ఈ రెండేళ్లు చాలా ముఖ్యం. ఈ కాలంలో పార్టీని మోయాల్సిన బాధ్యత, బాధితులైన ప్రజల పక్షాన పార్టీ తరఫున నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై ఉందని మర్చిపోవద్దు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0లో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. గత పాలనలో మన కార్యకర్తలను అంత బాగా చూసి ఉండకపోవచ్చు. మనం రాగానే కోవిడ్ రావడంతో, రెండేళ్లు పరిపాలన మీదే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది.
కానీ, ఈసారి అలా ఉండదు. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మీ ఆధ్వర్యంలోనే, మీ చేతుల మీదుగానే అందిస్తాం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు పేదలకు అండగా, తోడుగా ఉండండి. అది మాత్రమే మిమ్మల్ని కోరుతున్నాను. మిగతా అన్ని విషయాల్లో మీకు తోడుగా నేనుంటాను’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో కార్యకర్తలు ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరఫున పోరాడుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే పరిహారం ఇస్తామని చెబుతున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రంపచోడవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ నాగులాపల్లి ధనలక్ష్మితో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


