సాక్షి, తాడేపల్లి: కంభం పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సహా నలుగురు మృతి చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పెళ్లి వేడుకకు హాజరై ఆలయానికి వెళ్లిన వారు ఈ విధంగా ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వివాహ వేడుకల ఆనందం నిండిన కుటుంబంలో ఇలాంటి పెను విషాదం నెలకొనడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తీవ్రంగా గాయపడినవారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
కాగా, మార్కాపురం జిల్లా కంభం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో కూడిన ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదం నింపింది. మృతి చెందిన వారిలో అలకనంద (19), అంకాలు (20), నగేశ్ (17) , నాగేశ్వరి (2) గిద్దలూరు నల్లబండ బజారు వాసులుగా గుర్తించారు. కాగా పెళ్లి కూతురు వీరక్కకు తీవ్ర గాయాలయ్యాయి.


