
పీలేరు(అన్నమయ్య): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ బందారువాండ్లపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన లోకనాథరెడ్డి, జీవనజ్యోతి కుమార్తె ఇందుజా (30)కు ఐదేళ్ల క్రితం బందారువాండ్లపల్లెకు చెందిన వరంపాటి శంకర్రెడ్డి కుమారుడు విజయశేఖర్రెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంపాటు వారి సంసారం సజావుగా సాగింది.
వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. విజయశేఖర్రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి వుండడంతో తరచూ భార్య భర్తలు గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇందుజా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పీలేరుకు చేరుకుని తమ కుమార్తెను అత్తింటివారే కడతేర్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్రెడ్డి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి, బంధువుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.