‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్‌ ప్లాంట్‌ కాదా?’ | Vizag Steel Plant Porata Committee Serious On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్‌ ప్లాంట్‌ కాదా?’

Sep 18 2024 10:41 AM | Updated on Sep 18 2024 2:39 PM

Vizag Steel Plant Porata Committee Serious On Chandrababu

సాక్షి, విశాఖ: ​విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఉక్కు పోరాట కమిటీ నేతలు.. కూటమి సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో సెంటిమెంట్‌ పనిచేస్తున్నప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ అంశంలో కూడా పనిచేస్తుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, గతంలో స్టీల్‌ ప్లాంట్‌పై ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్‌ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తాజాగా ఉక్కు పోరాట కమిటీ నేత వరసాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘అమరావతి విషయంలో సెంటిమెంట్ పని చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా సెంటిమెంట్‌ పనిచేయాలి కదా?. అమరావతి సెంటిమెంట్‌తో ముడిపడిందని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. అమరావతి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే సెంటిమెంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వారి సెంటిమెంట్. అమరావతికి 29 గ్రామాల రైతులు భూములు ఇస్తే.. స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాల వారు భూములు త్యాగం చేశారు. చంద్రబాబు ఆలోచించి మాట్లాడాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు.. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నాయని సీఎం చంద్రబాబు మాట్లాడటంపై ప్రజా సంఘాల జేఏసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేవు. సొంత గనులు కేటాయించేలా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.. లేదా స్టీల్ ప్లాంట్‌ను సేయిల్(SAIL)‌లో విలీనం చేయించాలి. స్టీల్ ప్లాంట్‌పై ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ మాటపై నిలబడాలి. స్టీల్ ప్లాంట్ సాధన కోసం ప్రాణ త్యాగం, పోరాటాలు చేశారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్‌తో కూడుకున్నది అని దేశం మొత్తం గుర్తించింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళక ముందే స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమైంది’ అని చెప్పుకొచ్చారు. 

ఇక, బుధవారం ఉదయం స్టీల్‌ ప్లాంట్‌ లోపల కాంట్రాక్ట్‌ కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు చేస్తున్నారు. కార్మికుల నినాదాలతో స్టీల్‌ ప్లాంట్‌ దద్దరిల్లుతోంది. మరోవైపు.. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్‌ కట్‌ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్‌ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొన్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. 

సెంటిమెంట్ కుదరదు.

ఇది కూడా చదవండి: మా కలలు చిదిమేసిన చంద్రబాబు ప్రభుత్వం.. విద్యార్థుల ఆవేదన

Advertisement
 
Advertisement
Advertisement