విశాఖపట్నం: మరణించిన స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.దామోదరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానాపురంలో కె.ప్రసాద్ అనే వ్యక్తి భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి జీవించేవాడు. ప్రసాద్ స్నేహితుడైన ధనాల అరుణ్కుమార్ (30) కూడా అదే ప్రాంతంలో నివసించేవాడు.
2019లో ప్రసాద్ అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మిపై నిందితుడు కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు 2021 ఏప్రిల్లో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు అరుణ్కుమార్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.


