సాక్షి, విశాఖపట్నం: వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పెందుర్తిలో అత్త జయంతి కనక మహాలక్ష్మి (66) అనుమానాస్పద మృతి కేసులో హత్య కోణం బయటపడింది. కోడలు సినీ పక్కిలో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.
కోడలు, మనవరాలు ‘దొంగ-పోలీస్’ ఆట పేరుతో అత్తను కుర్చీకి కాళ్లను తాళ్లతో బంధించారు. కళ్లకు గంతలు కట్టి కదలకుండా బంధించిన కోడలు.. అనంతరం కుర్చీలో కదలలేని పరిస్థితుల్లో ఉన్న అత్తపై పెట్రోల్ పోసి.. దేవుడి గదిలో ఉన్న దీపం విసిరి నిప్పంటించింది.
అనంతరం కోడలు.. అగ్ని ప్రమాదం జరిగిందంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తనపై అనవసరంగా చిరాకు పెడుతుందనే కారణంతోనే అత్తను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు, మనవరాలు, అత్త జయంతి కనకమాలక్ష్మి పెందుర్తి అప్పన్నపాలెంలో నివాసముంటున్నారు.


