సాక్షి, కడప: కడప నుండి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ఆంధ్ర- కర్ణాటక బార్డర్లోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట సమీపంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి, 10మందికి పైగా గాయాలు పాలైనట్టు సమాచారం. మంగళవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
స్థానికుల సమాచారం మేరకు ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58)గా గుర్తింపు.
గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.



