అంత్యక్రియలకు ముందు చలనం
మరణం అంచు నుంచి తిరిగి వచ్చిన వైనం
మృతుడు మాట్లాడటంతో షాక్ గురైన జనం
మరణించాడనుకున్న వృద్ధుడు మళ్లీ బతికాడు
సాక్షి,బళ్లారి: మరణించాడని భావించిన ఓ వృద్ధుడిని అంత్యక్రియలకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో శ్వాస ఆడటంతో అందరూ ఆశ్చర్యానికి గురై తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాగల్కోట జిల్లాలోని జమఖండి పట్టణంలోని ముబారక్ అవతి(65) అనే వృద్ధుడు గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు బెళగావి ఆస్పత్రిలో చేరి్పంచారు. అక్కడ ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు.
అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాణాపాయం ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వెంటిలేటర్పై నుంచి తొలగించిన తరుణంలో శ్వాస ఆగిపోయిందని వైద్యులు కూడా సూచించారు. ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక చనిపోయాడని భావించి వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళుతుండగా, మార్గమధ్యంలోని లోకాపుర వద్ద శ్వాస కదలికలు వచ్చాయి.
ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో కొన్నిసార్లు శ్వాస అలా మందగించి కనిపించకపోవచ్చని, అలాంటి సందర్భాల్లో వ్యక్తి మరణించినట్లు భావించే అవకాశం ఉంటుందని తెలిపారు. సరైన వైద్య పరీక్షలు లేకుండా మరణించాడని కూడా నిర్ధారించడం సరికాదని కూడా వారు సూచించారు. ఈ ఘటన బాగల్కోట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


