జమ్ము నుంచి ఓ సైనికుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన
నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామ పరిధిలోని తన 2.38 ఎకరాల భూమిపై టీడీపీ మండల నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జవాన్ భాష్యం మహేష్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. దేశానికి సేవలు అందిస్తున్నానని, తన ఆస్తినే కాజేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నా పేరు భాష్యం మహేష్. మాది మహానంది మండలం తమ్మడపల్లె గ్రామం. నేను సైనికుడిగా జమ్ము–కశ్మీర్లో సేవలు అందిస్తున్నా. నాకు తమ్మడపల్లెలో 2.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
దానిని టీడీపీ నాయకులు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కంచర్ల శివ, ఆయన అనుచరులు కలిసి నా భూమిని ఆక్రమించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్కు నేను విన్నవించేది ఒక్కటే... దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న ఒక సైనికుని ఆవేదన అర్థం చేసుకుని మీరు నా సమస్యను పరిష్కరించండి. నా ఆస్తిని ఆక్రమించుకోకుండా కాపాడండి.. జై హింద్’ అని జవాన్ మహేష్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.


