ఎటెళ్లిపోయాయో.. ఆ 900 బస్తాలు | TDP leadar Massive illegal PDS rice racket in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఎటెళ్లిపోయాయో.. ఆ 900 బస్తాలు

Jun 15 2025 3:17 AM | Updated on Jun 15 2025 9:48 AM

TDP leadar Massive illegal PDS rice racket in Andhra pradesh

శనివారం ఉదయానికి గోదాములో మిగిలిన బస్తాలు

రేషన్‌ బియ్యానికి.. రాత్రికి రాత్రే రెక్కలు!

శుక్రవారం అర్ధరాత్రి సివిల్‌ సప్లయ్స్‌­ రాష్ట్ర డైరెక్టర్‌ తనిఖీ 

గోదాములో వెయ్యికి పైగా బస్తాల గుర్తింపు

శనివారం ఉదయానికి 109 బస్తాలు మినహా మిగిలినవన్నీ మాయం.. అర్ధరాత్రి గోడౌన్‌ వద్దకు టీడీపీ ముఖ్యనేత కుమారుడు!

తండ్రికి తెలియకుండా తనయుడి దందా..

ఆదోనిలో ఎల్లోగ్యాంగ్‌ దోపిడీ పర్వం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని టీడీపీ కూటమి నేతలు బుక్కేస్తున్నారు. రూ.కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు. వెయ్యి బస్తాలకు పైగా రేషన్‌ బియ్యం ఉన్న ఓ గోదామును అధికారులు శుక్రవారం తనిఖీచేసి తాళం వేయగా తెల్లారేసరికి 109 బస్తాలను ఉంచి మిగిలిన వాటిని రాత్రికి రాత్రే తరలించేశారంటే పచ్చమూకలు ఎంతటి బందిపోట్లో తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ బాగోతం వెనుక టీడీపీ ముఖ్యనేత  కుమారుడున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాలివీ.. ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం అక్రమ బియ్యం దందాపై ఇచ్చిన సమాచారంతో పట్టణంలోని శిరుగుప్ప రోడ్డులో ఉన్న ఓ గోదామును సివిల్‌ సప్లయ్స్‌ రాష్ట్ర డైరెక్టర్‌ మహేష్‌నాయుడు తనిఖీ చేశారు. అందులో వెయ్యిబస్తాలకు పైగా రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆయన గోడౌన్‌కు తాళం వేయించారు. దానిని సీజ్‌ చేసేందుకు శనివారం ఉదయం ఆయన గోదాముకు వచ్చారు. గోదాములో కేవలం 109 బస్తాలు మాత్రమే ఉండడాన్ని చూసి మహేష్‌నాయుడు, సివిల్‌ సప్లయ్స్, డిప్యూటీ తహసీల్దార్‌ బాబు, పోలీసు అధికారులు అవాక్కయ్యారు. మిగతా బియ్యం బస్తాలన్నీ రాత్రికి రాత్రే తరలిపోయాయి. 

రంగంలోకి టీడీపీ ముఖ్యనేత కుమారుడు!..
మహేష్‌నాయుడు గోడౌన్‌ తనిఖీకి వెళ్లగానే ఆదోనికి చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. వెయ్యికి పైగా బియ్యం బస్తాలు పట్టుబడినట్లు తెలుసుకుని ఆయన తనకేమీ సంబంధంలేదని తప్పుకున్నట్లు సమాచారం. అయితే, ఆ వెంటనే సదరు ముఖ్యనేత కుమారుడు అక్కడికి చేరుకోవడం, తన తండ్రికి తెలీదని.. చూసీచూడనట్లుగా వదిలేయాలని డైరెక్టర్‌ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా సంపాదించుకునేందుకు అడ్డుతగిలితే ఎలాగని డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. 

ముఖ్యనేతల కుమారుల బియ్యం దందా..
వాస్తవానికి.. ఆదోని టీడీపీలో రెండు వర్గాలున్నాయి. అందులో ఒక వర్గం నేత కుమారుడు ఆదోని పట్టణం, మరో వర్గం నేత కుమారుడు ఆదోని రూరల్‌ ఏరియాలో బియ్యం దందా చేస్తున్నారు. వీరిని నిలువరించే వాళ్లు లేకపోవడంతో వారిద్దరూ పోటీపడి మరీ బియ్యం దందాను సాగిస్తున్నారు. సమీపంలోని కర్ణాటక సరిహద్దులు దాటించి రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి.

దోషులపై పీడీ యాక్ట్‌..
రేషన్‌బియ్యం దందాలో ఎవరెవరి హస్తం ఉందో సోమవారం తేలుస్తాం. రాత్రి వెయ్యికి పైగా బియ్యం బస్తాలున్నట్లు గుర్తించాం. తెల్లారేసరికి అవన్నీ నిపించకుండాపోవడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. విషయాన్ని పైకి తీసుకెళ్తా. పూర్తిస్థాయి విచారణ చేయించి దోషులపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయిస్తాం.
– మహేష్‌నాయుడు, సివిల్‌ సప్లయ్స్‌ డైరెక్టర్‌

కచ్చితంగా టీడీపీ నేతల ప్రమేయం..
పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.  ఈ దందాలో కచ్చితంగా టీడీపీ నేతల ప్రమేయం ఉంది. పూర్తిస్థాయి విచారణ చేయకుండా అసలైన దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. – వై. సాయిప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆదోని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement