టీడీపీ కూటమి విజయోత్సవ సభకు రూ.కోట్లు ఖర్చు
నాలుగు విమానాలు.. ఓ హెలికాప్టర్ వినియోగం
ప్రతి శుక్రవారం నో వెహికల్స్ డే.. అయినా భారీగా వాహనాల వినియోగం
సాక్షి, టాస్క్ ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేశారు. పబ్లిసిటీ కోసం పొదుపు పాటిస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. ఆచరణలో మాత్రం అమలు చేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద శుక్రవారం టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యే నేతలు నాలుగు విమానాలు, ఓ హెలికాప్టర్ వినియోగించినట్లు రేణిగుంట విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక చాపర్లో రేణిగుంటకు చేరుకున్నారు. మంత్రి లోకేశ్, జిల్లా టీడీపీ ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, మరి కొందరు మంత్రులు మరో మూడు ప్రత్యేక విమానాల్లో రేణిగుంటకు చేరుకున్నట్లు తెలిపారు. పొదుపు మంత్రంలో భాగంగా వారంలో ప్రతి శుక్రవారం నో వెహికల్స్ డే అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ విజయోత్సవ సభకు భారీఎత్తున వాహనాలు వినియోగించారు.
రేణిగుంట విమానాశ్రయం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దామినేడు సభాస్థలి వరకు కాన్వాయ్లో చేరుకున్నారు. విజయోత్సవ సభకు జన సమీకరణ కోసం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ప్రత్యేక వాహనాలను పంపి స్థానికులను రప్పించుకున్నారు. ఈ వాహనాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ నెల 7 నుంచి 12 వరకు ఉండేలా సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లకు మొత్తంగా రూ.3 కోట్లు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.


