
మంగళగిరి కేంద్ర కార్యాలయం ముందు శింగనమల కార్యకర్త నిరసన
అనంతపురం జిల్లా: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వేధింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించాలని నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం కనంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద భార్య, పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు.
‘సేవ్ లోకేశ్ అన్న’ అంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. స్థానిక అంశాలపై ప్రసాద్ ఇప్పటికే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీతో విభేదించారు. ఆమె తీరుపై పలుమార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను ధిక్కరించినందుకుగానూ అతడిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ మరోమారు మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో నిరసన తెలిపాడు.