అదనపు ఎస్పీ సంతోష్కు ఫిర్యాదు చేస్తున్న మహిళ
‘‘మా నాన్న అధికార పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు నా మనషులే.. ఏమనుకుంటున్నావ్.. నేను తల్చుకుంటే నిన్ను, నీ భర్తను ఏమైనా చేయగలను’’ అంటూ అంటూ టీడీపీ మహిళా నేత ఒకరు బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన కాపురం చెడగొట్టద్దని వేడుకంటే చంపేస్తానని బెదిరిస్తోందని వాపోతోందామె.
సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణానికి చెందిన కర్లకుంట కృష్ణదీప్తి తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)ను ఆశ్రయించింది. టీడీపీకి చెందిన మల్లవరపు అభినయ సింధూర తన కాపురంలో నిప్పులు పోసిందని.. గట్టిగా నిలదీస్తే తెలుగు దేశం పెద్దలు పేర్లు చెబుతోందని చెబుతోంది.
‘‘నా భర్త కాళీ.. ముగ్గురు సంతానంతో సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యేగారి కూతురునంటూ 10 నెలల కిందట మల్లవరపు అభినయ సింధూర నా భర్తకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె మోజులో పడి నా భర్త ఇంటికి కూడా రాలేదు. ఆయన్ని వదిలేయాలని బతిమాలితే.. ‘నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మా మావయ్య’ అని బెదిరిస్తోంది. నా భర్తకు విడాకులివ్వాలని నాపై ఒత్తిడి చేస్తోంది. మాట వినకపోతే నా భర్తను అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తోంది. నన్ను, నా బిడ్డలను చంపేస్తానంటోంది..
.. హానీ ట్రాప్ లేడీలా వ్యవహరిస్తున్న సింధుర మీద టూటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్ కౌన్సెలింగ్ నిర్వహించి నా భర్తను కూడా మందలించారు. మనసు మార్చుకున్న నా భర్త.. మా కోసం దిగివచ్చాడు. దీంతో రేప్ కేసు పెడతానంటూ సింధూర నా భర్తపై బెదిరింపులకు దిగింది. నీ భార్యను వదిలి రాకపోతే ఆత్మహాత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తోంది. అయినా వినకుంటే నన్ను హత్య చేయిస్తానని నా భర్తకు నరకం చూపిస్తోంది.
ఇప్పటికే మేం ఆర్థికంగా దెబ్బతిని.. అప్పులలో కూరుకుపోయామని ఉన్నాం. మా బతుకు మమ్మల్ని బతుకనీయండి అని వేడుకున్నా సింధూర కనికరించడం లేదు. అధికార పార్టీ నేతల అండ దండలు చూసి ఆమె రెచ్చిపోతోంది. ఆమె నుంచి మాకు ప్రాణహని ఉంది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అని ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో బాధితురాలు కృష్ణదీప్తి పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించాల్సి ఉంది.


