సాక్షి, కాకినాడ జిల్లా: చనిపోక ముందే కుటుంబసభ్యులకు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తనను ఎక్కడ ఖననం చేయాలో ముందే చెప్పిన ముద్రగడ.. ఇంటి ఆవరణలోనే తనను ఖననం చేయాలని చెప్పారు. ప్రభుత్వ లాంఛనాలు తనకు అవసరం లేదంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల గౌరవ వందనం కూడా అవసరం లేదని.. జీవించి ఉన్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. మరణానంతరం ఇచ్చే గౌరవం తనకు అవసరం లేదని లేఖలో స్పష్టం చేశారు. తాను మరణించినా భార్య పుణ్య స్త్రీగానే ఉండాలని పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వ తీరుపై ముద్రగడ పద్మనాభం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలు వద్దన్నా కానీ, ప్రభుత్వం.. గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు గోబ్యాక్ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేశారు.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్.. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. ఆయన పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు.


